YS Sharmila: వైఎస్‌ షర్మిలకు 14 రోజుల రిమాండ్‌

వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. 

Updated : 24 Apr 2023 22:10 IST

హైదరాబాద్‌: పోలీసులపై దాడి కేసులో వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల(YS Sharmila)కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మే 8 వరకు ఆమె రిమాండ్‌లో ఉండనున్నారు. సిట్‌ కార్యాలయాన్ని ముట్టడించిన తర్వాత  ‘టీ సేవ్‌’ నిరాహార దీక్షలో భాగంగా.. ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి మద్దతు కోరాలని షర్మిల నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం ఇంటి నుంచి షర్మిల బయలుదేరుతుండగా.. పోలీసులు భారీ ఎత్తున మోహరించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, షర్మిలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో సహా మరో ఇద్దరిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1గా వైఎస్ షర్మిల, ఏ2గా కారు డ్రైవర్ బాలు, ఏ3 గా మరో డ్రైవర్ జాకబ్‌ల పేర్లు చేర్చారు.

వైఎస్‌ షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు 24 గంటలూ పని చేస్తారని,  అలాంటి వారిపై చేయి చేసుకోవడం వల్ల సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని అన్నారు. షర్మిల తన కారు డ్రైవర్‌ను వేగంగా పోనివ్వాలని చెప్పారని, ఈ క్రమంలో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌కు కాలికి గాయాలయ్యాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరో మహిళా కానిస్టేబుల్‌తోపాటు, ఎస్సై పైనా షర్మిల చేయి చేసుకున్నారని కోర్టుకు వివరించారు.

షర్మిల తరఫు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షర్మిలను అడ్డుకున్నారని అన్నారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. షర్మిలను పోలీసులు బయటకి అనుమతించడం లేదని,పోలీసులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలిపారు.  ఓ ఎస్సై తనను చేతితో తాకే ప్రయత్నం చేశారని షర్మిల కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘చాలా మంది పోలీసులు తనను అడ్డుకొని చేయి విరిచే ప్రయత్నం చేశారు. నన్ను కొట్టారు. ఈ క్రమంలో నేను వాళ్లను తోసేశాను’ అని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తొలుత తీర్పును రిజర్వ్‌ చేసింది. అనంతరం 14 రోజుల రిమాండ్‌ విధిస్తున్నట్లు వెల్లడించింది. కాగా.. షర్మిల బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయగా.. న్యాయస్థానం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని