
Short Dress: షార్ట్ డ్రెస్ చూసి.. కర్టెన్ కాళ్లకు చుట్టి పరీక్ష రాయించారు
ఆవేదన వ్యక్తం చేసిన 19ఏళ్ల అస్సాం విద్యార్థిని
ఇంటర్నెట్ డెస్క్: ఎక్కడైనా సరే! పరీక్షా కేంద్రానికి ఒక్కనిమిషం ఆలస్యంగా హాజరైనా లేదా హాల్టికెట్ మర్చిపోయినా పరీక్ష రాయనివ్వని సంఘటనలు చూస్తూ వచ్చాం. కానీ అక్కడ అలా జరగలేదు. పొట్టిబట్టలు (షార్ట్స్) వేసుకొచ్చిందనే కారణం చెప్పి ఆమెను పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. చివరికి కాళ్లకు కర్టెన్ చుట్టుకొని పరీక్ష గదిలోకి అడుగుపెట్టి.. అలా పరీక్ష పూర్తిచేసింది. ఈ ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. బుధవారం జూబ్లీ (19) అనే విద్యార్థిని.. అస్సాంలోని గిరిజానంద చౌదరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ (జీపిఐస్) భవనంలో అస్సాం అగ్రికల్చరల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష (ఏఏయూ) రాసేందుకు వచ్చింది. తన స్వగ్రామం బిశ్వనాథ్ చారియాలి నుంచి తేజ్పుర్కు 70కి.మీ తన తండ్రితో పాటు ప్రయాణించి చేరుకుంది. అక్కడ ఎదురైన చేదు అనుభవాన్ని ఇలా వివరించింది.
‘‘సెంటర్ లోపలికి వెళ్లేందుకు సెక్యూరిటీ గార్డ్స్ అనుమతించారు. అయితే ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్తుంటే షార్ట్స్ ధరించానని చెప్పి ఇన్విజిలేటర్ నన్ను పరీక్ష రాయనివ్వకుండా ఆపేశారు. దీంతో ఏడ్చుకుంటూ బయట ఉన్న మానాన్నతో జరిగిన విషయమంతా చెప్పా. పరీక్ష రాసేలా చూడమని ఎగ్జామ్స్ కంట్రోలర్ని అడిగితే.. పాంట్స్ వేసుకొస్తే తప్ప లోపలికి రానివ్వమని కరాకండీగా చెప్పేశారు. దీంతో మా నాన్న 8కి.మీ ప్రయాణంచి మార్కెట్లోకి వెళ్లి ట్రౌజర్ తీసుకొచ్చారు. ఈలోపే నాకు కర్టెన్తో కాళ్లు కప్పి పరీక్ష రాయించారు. నా జీవితంలో అత్యంత అవమానకరమైన సంఘటన’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
‘నీట్’కి ఇలాగే వెళ్లా..
కొన్నిరోజుల క్రితం నీట్పరీక్ష రాసేందుకు ఇదే డ్రెస్లో వెళ్లా. అయినప్పటికీ అక్కడ ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఏఏయూ వాళ్లు సైతం డ్రెస్కోడ్ గురించి ఏమాత్రం ప్రస్తావించలేదు. మరి నేను ఎలా తెలుసుకోగలను? అంటూ మీడియా ముందు ఆమె ప్రశ్నలేవనెత్తింది. డ్రెస్పై చూసిన శ్రద్ధ కొవిడ్ నిబంధనలపై లేదని ఆమె ఆరోపించారు. మాస్కు ధరించడం, టెంపరేచర్ చెక్ చేయడం పక్కన పెట్టేశారని తెలిపారు.
ఈ ఘటన గురించి తెలియదు..
‘ఈ ఘటన జరిగినప్పుడు నేను కాలేజీలో లేను. దీని గురించి నాకు ఎలాంటి సమాచారం అందలేదు. కేవలం పరీక్ష నిర్వహించుకునేందుకు మా కాలేజీని అద్దెకు తీసుకున్నారు. షార్ట్స్ వేసుకోకూడదనే నియమ నిబంధనలు ఏమీ లేవు. కాకపోతే పరీక్ష వేళ పద్ధతిగా ప్రవర్తించాల్సిన అవసరాన్ని పిల్లలతో సహా పెద్దలు తెలుసుకోవాలి’- డా. అబ్దుల్ అహ్మద్, జీఐపీఎస్, ప్రిన్సిపల్