యూపీలో 2,290 కరోనా రోగుల గల్లంతు

ఉత్తర ప్రదేశ్‌ రాజధాని లక్నోలో వింత పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. గత 9 రోజుల్లో పరీక్షించిన వారిలో..

Updated : 03 Aug 2020 15:41 IST

పరీక్షల సమయంలో చిరునామాలు తప్పుగా ఇవ్వడమే కారణం

లఖ్‌నవు: ఉత్తర ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవులో వింత పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. గత 9 రోజుల్లో పరీక్షించిన వారిలో 2,290 మంది కరోనా రోగుల ఆచూకీ లభించడం లేదు. టెస్టుల సమయంలో వారంతా పేర్లు, చిరునామాలు, సెల్‌ ఫోన్‌ నంబర్లు తప్పుగా నమోదు చేసుకోవడమే ఇందుకు కారణం. గల్లంతైన వారంతా జులై 23 నుంచి జులై 31 మధ్య పరీక్షలు నిర్వహించుకున్న వారే కావడం గమనార్హం. టెస్టు రిపోర్టులను రోగులకు తెలిపేందుకు అధికారులు ప్రయత్నించగా వారి ఆచూకీ లభించకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు వెంటనే ఈ విషయాన్ని రాష్ట్ర పోలీసు శాఖకు తెలుపగా వారు ఇప్పటివరకు 1,171 మంది రోగులను కనుగొన్నారు. మరో 1,119 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. మిగతావారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. అధికారులకు తప్పుడు వివరాలు ఇచ్చినందుకు వీరందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.

ఇదే విషయమై  కమిషనర్‌ సుజిత్‌ పాండే ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘కరోనా వైరస్‌ను గుర్తించేందుకు ప్రభుత్వం వేల పరీక్షలు నిర్వహిస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి పరీక్షలు జరుపుతున్నారు. ఈ సమయంలో కొందరు పేరు, చిరునామా, చరవాణి నంబరు తప్పుగా ఇస్తున్నారు. గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. ఇప్పటివరకు 1,171 మందిని కనుకొన్నాం. మిగతావారిని గుర్తించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. కరోనా పరీక్షలు నిర్వహించే ఆసుపత్రులు, ల్యాబులు నమూనాలు సేకరించేముందు వారి కచ్చితమైన వివరాలు తెలుసుకోండి’ అని కమిషనర్‌ ఆదేశించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని