CT scan: 300 నుంచి 400 చెస్ట్‌ ఎక్స్‌రేలతో సమానం

ప్రస్తుతం కరోనా బారిన పడివారికి కొందరు వైద్యులు ఎడాపెడా సిటీస్కాన్‌కు సిఫారసు చేస్తున్నారు. యాంటీజెన్‌, ఆర్టీపీసీఆర్‌ టెస్టుల్లో నెగెటివ్‌గా

Published : 03 May 2021 21:05 IST

కరోనా పేషెంట్లకు ఎయిమ్స్‌ చీఫ్‌ సలహా

న్యూదిల్లీ: ప్రస్తుతం కరోనా బారిన పడివారు, యాంటీజెన్‌, ఆర్టీపీసీఆర్‌ టెస్టుల్లో నెగెటివ్‌గా వచ్చిన వారు భయంతో సిటీస్కాన్‌ చేయించుకుంటున్నారు. సిటీస్కాన్‌ వల్ల మంచి కంటే దుష్ప్రభావాలే ఎక్కువని ఎయిమ్స్‌ చీఫ్‌ డా.రణదీప్‌ గులేరియా హెచ్చరించారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడేవారికి సిటీస్కాన్‌ అక్కర్లేదని స్పష్టం చేశారు. కొవిడ్‌ పాజిటివ్‌గా వచ్చిన వారు సిటీస్కాన్‌ను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.

‘ఒక సిటీస్కాన్‌ 300 నుంచి 400 చెస్ట్‌ ఎక్స్‌రేలతో సమానం. తరచూ సిటీస్కాన్‌ చేయడం వల్ల యువత క్యాన్సర్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ శరీరం రేడియేషన్‌కు గురికావడం వల్ల అంతర్గతంగా దెబ్బతింటుంది. దయచేసి స్వల్ప కొవిడ్‌ లక్షణాలు ఉండి, సాధారణ ఆక్సిజన్‌ స్థాయిలు ఉన్నవారు సిటీస్కాన్‌ చేయించుకోవద్దు’అని గులేరియా సూచించారు. కేవలం ఆస్పత్రిలో చికిత్స పొందేవారు మాత్రమే, అది కూడా వైద్యుల సూచనల మేరకే సిటీ స్కాన్‌ చేయించుకోవాలని అన్నారు. అయితే అంతకుముందు చెస్ట్‌ ఎక్స్‌రేకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్వల్ప లక్షణాలతో పాటు, అసలు లక్షణాలు లేని వారు కూడా సిటీస్కాన్‌ చేయించుకుంటున్నట్లు ఇటీవల గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో గులేరియా ఈ హెచ్చరిక చేశారు.

అదే విధంగా కరోనా వైరస్‌ సోకగానే స్టెరాయిడ్స్ తీసుకోవద్దని కూడా డా.రణదీప్‌ గులేరియా సూచించారు. వైరస్‌ ప్రారంభ దశలోనే స్టెరాయిడ్లను తీసుకోవడం వల్ల వైరల్‌ రిప్లికేషన్‌ జరిగే అవకాశం ఉందన్నారు. తీవ్రమైన వైరల్‌ న్యుమోనియాకు దారితీస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా యువకులు వైరస్‌ ప్రారంభ దశలో స్టెరాయిడ్స్‌ తీసుకోవద్దని సలహా ఇచ్చారు. రెమ్‌డెసివిర్‌, ప్లాస్మా, టోసిలిజుమాబ్‌ వంటి ఔషధాలు అత్యవసర వినియోగానికి మాత్రమేనని స్పష్టంచేశారు. వాటిని సరైన సమయంలో వాడటం ముఖ్యమని తెలిపారు.

హోం ఐసోలేషన్‌లోఉంటున్నవారు ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకోవాలని తెలిపారు. ఆక్సిజన్‌ స్థాయి 93 లేదా అంతకంటే తగ్గినా, ఛాతీ నొప్పి, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత తప్పని సరిగా వ్యాక్సిన్‌ ప్రైమింగ్‌ డోస్‌, బూస్టర్‌ డోస్‌ రెండూ తీసుకోవాలని సలహా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని