
‘స్థానికం’పై ఎస్ఈసీకి ఏపీ ప్రభుత్వం నివేదిక
అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్కు ప్రభుత్వం కీలక నివేదిక సమర్పించింది. ఎస్ఈసీతో ఈ సాయంత్రం జరిగిన సమావేశంలో సీఎస్ నీలం సాహ్ని ఈ మేరకు ప్రభుత్వం తరఫున నివేదిక అందజేశారు. రాష్ట్రంలో కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తిస్థాయిలో ఇంకా అదుపులోకి రాలేదని.. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల నిర్వహణ కష్టమని ప్రభుత్వం నివేదికలో స్పష్టం చేసింది. రోజుకు సుమారు 3వేల కొవిడ్ కేసులు నమోదవుతున్నాయని.. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదముందని పేర్కొంది. ఎన్నికల నిర్వహణకు కీలకమైన ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసుల్లో చాలా మంది కరోనా బారిన పడ్డారని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. దీనికి సంబంధించి ప్రభుత్వ విభాగాల వారీగా వివరాలను ఎస్ఈసీకి సీఎస్ అందజేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోకి రాగానే స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీని సంప్రదిస్తామని ప్రభుత్వం ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.
స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తెలపాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ కోరారు. దీంతో సీఎస్ నీలం సాహ్ని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని నివేదిక రూపంలో సమర్పించారు. ఈ ఉదయం వివిధ రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ సమావేశం నిర్వహించిన స్థానిక ఎన్నికలపై వారి అభిప్రాయాలను సేకరించారు. ఆ సమావేశం అనంతరం ఎస్ఈసీతో సీఎస్ భేటీ అయ్యారు.
ఇదీ చదవండి..