కరోనా ఎఫెక్ట్‌: యువతలో పెరిగిన ఆందోళన..!

కరోనా వైరస్‌ చూపిన ప్రభావంతో దాదాపు 31శాతం మంది కౌమర దశలో ఉన్న యువత తీవ్ర ఆందోళనకు గురైనట్లు తాజా సర్వే వెల్లడించింది.

Published : 25 Oct 2020 02:04 IST

దిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ ప్రభావం దేశాల ఆర్థిక వ్యవస్థలతోపాటు వ్యక్తుల మానసిక ఆరోగ్యంపై పడుతోంది. తాజాగా మనదేశ యువతపైనా ఇది ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ చూపిన ప్రభావంతో దాదాపు 31శాతం మంది కౌమర దశలో ఉన్న యువత తీవ్ర ఆందోళనకు గురైనట్లు తాజా సర్వే వెల్లడించింది. గత నాలుగు నెలల కాలంలో బాలికలు లింగ వివక్షకు గురికావడంతోపాటు చదువుకు కూడా దూరమవుతున్నట్లు తెలుస్తోంది. దేశంలోని కేవలం నాలుగు రాష్ట్రాల్లో జరిపిన ఈ సర్వేలో దాదాపు 7300మంది యువతీ, యువకులు పాల్గొన్నారు. ‘కరోనా - ప్రభావంపై యువత అభిప్రాయం’ పై సెంటర్‌ ఫర్‌ క్యాటలైజింగ్‌ ఛేంజ్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఓ సర్వే జరిపింది. ఏప్రిల్‌, జులై, ఆగస్టు నెలల్లో రెండు దఫాలుగా ఈ సర్వే నిర్వహించింది.

సర్వేలో పాల్గొన్న యువతీ, యువకుల్లో దాదాపు 31శాతం మంది తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి తీవ్ర ఆందోళన చెందినట్లు సర్వే వెల్లడించింది. అంతేకాకుండా ఈ నాలుగు నెలల కాలంలో బాలికలు తీవ్ర లింగ వివక్షతకు గురైనట్లు తేలింది. సర్వేలో పాల్గొన్న బాలికల్లో దాదాపు 12శాతం మంది ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యేందుకు సొంత మొబైల్‌ ఫోన్‌లు కలిగి ఉండగా, అబ్బాయిల్లో మాత్రం 35శాతం మందికి ఫోన్లు ఉన్నట్లు గుర్తించింది. 51శాతం బాలికలు తమకు అవసరమైన పుస్తకాలు పొందలేదని ఇది అబ్బాయిలతో పోలిస్తే చాలా ఎక్కువని తెలుస్తోంది. మహమ్మారి విజృంభణ సమయంలో బాలికలు ఏ విధంగా చదువుకు దూరమయ్యారోననే విషయాన్ని ఇది తేటతెల్లందిచేస్తోందని నివేదిక స్పష్టంచేసిం. కుటుంబానికి ఆర్థికంగా చేదోడుగా నిలిచేందుకు దాదాపు 39శాతం బాలికలు సహాయం చేస్తుండగా, ఇది అబ్బాయిల్లో 35శాతంగా ఉంది. కేవలం 39శాతం మంది బాలికలు ఇంటినుంచి ఒంటరిగా బయటకు వెళ్లేందుకు అనుమతించగా.. 62శాతం అబ్బాయిలు స్వేచ్ఛగా తిరిగినట్లు నివేదిక తెలిపింది.

ఇక వివిధ అత్యవసర విభాగాలకు చెందిన హెల్ప్‌లైన్‌ల నెంబర్లను గుర్తించుకోవడంలోనూ యువత వెనుకబడే ఉంది. సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 36శాతం యువత వీటిని గుర్తుపెట్టుకోగా వీటి ఉపయోగం గురించి తెలిసిన వారిసంఖ్య మరింత తక్కువగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు