పిల్లలకు మేలు చేసే బ్యాక్టీరియానట!

పడకగదిలోని మంచం, పరుపులపై ఉండే దుమ్ముధూళీలోని సూక్ష్మజీవులు కొంతమేరకు పిల్లల ఆరోగ్యానికి ఉపకరిస్తాయట. డెన్మార్క్‌ పరిశోధకులు ఈ ఆసక్తికర అంశం గురించి చెప్పుకొచ్చారు. పరుపులపై ఉండే సూక్ష్మజీవులకు, పిల్లల శరీరంలోని కొంత బ్యాక్టీరియాకు మధ్య సంబంధం ఉన్నట్లు పేర్కొంటున్నారు.

Updated : 13 Dec 2020 11:01 IST


ఇంటర్నెట్‌ డెస్క్‌ : పడకగదిలోని మంచం, పరుపులపై ఉండే దుమ్ముధూళీలోని సూక్ష్మజీవులు కొంతమేరకు పిల్లల ఆరోగ్యానికి ఉపకరిస్తాయట. డెన్మార్క్‌ పరిశోధకులు ఈ ఆసక్తికర అంశం గురించి చెప్పుకొచ్చారు. పరుపులపై ఉండే సూక్ష్మజీవులకు, పిల్లల శరీరంలోని కొంత బ్యాక్టీరియాకు మధ్య సంబంధం ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఫలితంగా ఎలర్జీ, ఆస్తమా ముప్పు తగ్గుతున్నట్లు వివరించారు.

కోపెన్‌ హాగన్‌ విశ్వవిద్యాలయం, డేనిష్‌ పీడియాట్రిక్‌ ఆస్తమా సెంటర్, జెంటోప్టే హాస్పిటల్‌కు చెందిన పరిశోధకుల బృందం ఈ విషయాన్ని గుర్తించింది. మన పడక గదిలోని పరుపులపై కంటికి కనిపించని సూక్ష్మజీవుల ప్రపంచం ఉంటుంది. చిన్ననాటి నుంచే ఆ ప్రపంచంతో సహజీవనం చేస్తున్నాం. ఫలితంగా కొన్నిసార్లు మనకు వ్యాధుల ముప్పు పెరిగితే, మరికొన్ని సార్లు కొన్ని రకాల జబ్బుల నుంచి రక్షణ దొరుకుతోంది. ఈ సంబంధాన్ని బాగా అర్థం చేసుకోవటానికి పరిశోధకులు 577 మంది శిశువుల పడకల నుంచి దుమ్ము నమునాలను సేకరించి, 542 మంది పిల్లల శ్వాసకోశ నమూనాలతో పోల్చి విశ్లేషించారు. తద్వారా మంచం దుమ్ములో కనిపించే బ్యాక్టీరియాకు, పిల్లలలో ఉండే వాటికి మధ్య పరస్పర సంబంధం ఉందని తేలింది. అవి ఒకే బ్యాక్టీరియా కానప్పటికీ, ఒకదానిని ఇంకొకటి ప్రభావితం చేస్తుందని గుర్తించారు. 

శుభ్రత పేరుతో బెడ్‌షీట్లను మార్చొద్దు...
ఈ పరిణామం పిల్లలలో తరువాతి సంవత్సరాల్లో ఉబ్బసం, ఎలర్జీ ప్రమాదాన్ని తగ్గించటంలో మంచి ప్రభావం చూపుతోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. పిల్లలు అన్ని రకాల సూక్ష్మజీవుల ప్రభావానికి లోనయినపుడే వారిలో వ్యాధి నిరోధకత పెరుగుతుంది, జబ్బులను తట్టుకోగలుగుతారని సైన్స్‌ చెబుతోంది. మంచం, పరుపులపై ఉండే సూక్ష్మజీవుల ప్రపంచం పిల్లల్లో వ్యాధి నిరోధకతకు ఎంతగానో ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. మంచంలోని సూక్ష్మజీవులు నివాస పరిసరాల ద్వారా ప్రభావితం అవుతాయి. ఇక్కడ అధిక బ్యాక్టీరియా వైవిధ్యం ప్రయోజనకరంగా ఉంటుంది. సుమారు ఆరునెలల వయసున్న పిల్లల పడకల నుంచి సేకరించిన దుమ్ములో మొత్తం 930 రకాల బ్యాక్టీరియా, శిలీంధ్రాలను కనుగొన్నారు. అందుకోసం గ్రామీణ, పట్టణ నివాసాలలో అధ్యయనం చేశారు. పట్టణాలతో పోల్చినపుడు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాక్టీరియా గణనీయంగా ఉంటోందని చెబుతున్నారు. శుభ్రత పేరుతో నిరంతరం పిల్లల బెడ్‌ షీట్లను మార్చటం సరికాదని, వారిని సూక్ష్మజీవుల ప్రపంచానికి పరిచయం చేయటమే మేలని సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని