ఈ చిట్కాలు పాటిస్తే తలనొప్పి మాయం

‘తలనొప్పి’.. ఏదో సమయంలో దాదాపు అందరినీ వేధిస్తుంది. చిరాకు తెప్పిస్తుంది. సహనం కోల్పోయేలా చేస్తుంది. అయితే దీని తీవ్రత ఒక్కొక్కరికి ఒక్కోలా...

Published : 12 Sep 2020 10:45 IST

‘తలనొప్పి’.. ఏదో సమయంలో దాదాపు అందరినీ వేధిస్తుంది. చిరాకు తెప్పిస్తుంది. సహనం కోల్పోయేలా చేస్తుంది. అయితే దీని ప్రభావం ఒక్కొక్కరిపై ఒక్కోలా ఉంటుంది. దీనిని తగ్గించుకోవడానికి మనం నానాపాట్లు పడుతుంటాం. పెయిన్ రిలీవర్స్‌ వాడుతాం. ఇంకా ఎక్కువైతే డాక్టర్‌ని సంప్రదిస్తాం. అయితే సాధారణంగా వచ్చే తలనొప్పిని వంటింటి వైద్యంతోనే నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చిన్న పాటి  చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు. మరి అవేంటో చూద్దామా?

1. బంగాళదుంపతో భలే రిలీఫ్‌ 
సాధారణంగా మన శరీరం డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు తలనొప్పి వస్తుంది. అలాంటప్పుడు శరీరానికి నీటితో పాటు పొటాషియం లాంటి ఎలక్ట్రోలైట్స్‌ కూడా అవసరమవుతాయి. బంగాళదుంపలో దాదాపు 75శాతం నీటితోపాటు పిండిపదార్థాలు, ఎలక్ట్రోలైట్స్‌ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు ఉడకబెట్టిన బంగాళదుంప తింటే చాలా ఉపయోగముంటుందని నిపుణులు చెబుతున్నారు.

2. చెర్రీతో ఉత్తేజం
రోజూ నిర్ణీత సమయంలోగానీ, లేదా ఏదైనా పని చేస్తున్నపుడు తలనొప్పి వస్తే.. కొన్ని చెర్రీ పళ్లను నోట్లో వేసుకుంటే చాలా ఫలితముంటుంది. చెర్రీ పళ్లలో చాలా రకాలున్నాయి. వాటిలో ఏది తిన్నా ఫర్వాలేదు. వీటివల్ల శరీరంలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఉత్పత్తి అయి, రక్తంలో కలిసి శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా తలనొప్పి దూరమవుతుంది. చెర్రీ పళ్లు అందుబాటులో లేనప్పుడు బీట్‌రూట్‌ రసం తీసుకున్నా ఫర్వాలేదు. అదే ప్రయోజనముంటుంది.

3. కీరదోస
దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 97 శాతం నీరే ఉంటుంది. శరీరాన్ని డీ హైడ్రేషన్‌ నుంచి ఉపశమనం కలిగించడానికి దీన్ని తీసుకుంటే సరిపోతుంది. నేరుగా దోసకాయ తినడం ఇష్టంలేని వారు కొద్దిగా ఉప్పు, కారం, మిరియాలు కలుపుకొని సలాడ్‌లా తినొచ్చు. దీని వల్ల శరీరంలో నీటి స్థాయిలు పెరిగి తలనొప్పి తగ్గడానికి అవకాశాలెక్కువ.

4.గుమ్మడి గింజలు

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. అంతేకాకుండా ఇది రక్తకణాలకు విశ్రాంతినిచ్చి తల నొప్పి తగ్గేలా చేస్తుంది. దీంతోపాటు బాదం తీసుకుంటే ఇంకా మంచింది. అరకప్పు గుమ్మడి గింజలు మనకు రోజువారీ కావాల్సిన మెగ్నీషియంను అందిస్తాయట. శరీరంలోని దాదాపు 300 జీవరసాయన చర్యలకు మెగ్నీషియం ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జీవక్రియ సక్రమంగా జరిగినట్లయితే తలనొప్పి వచ్చేందుకు ఆస్కారం చాలా తక్కువ.

5. హాట్‌ ఘాటు మిరియాలు
తలనొప్పి, జలుబు బాగా వేధిస్తుంటే కొంతమందికి ఘాటుగా ఏదైనా తినాలనిపిస్తుంది. దీనివల్ల ముక్కు సక్రమంగా పని చేస్తుంది. ప్రధానంగా సైనస్‌తో బాధపడేవారికి మిరియాలు బాగా ఉపయోగపడతాయి. మిరియాలను పౌడర్‌గా చేసి వేడి నీళ్లలోనో, టొమాటో జ్యూస్‌లోనో కలిపి తింటే ఫలితముంటుదట. మిరియాల ఘాటు వల్ల ముక్కు రంద్రాలు సక్రమంగా పని చేసి చక్కగా ఊపిరాడుతుంది. ఫలితంగా రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులు పెరిగి తలనొప్పి తగ్గే అవకాశముంది.

6. ఓట్స్‌ తప్పని సరి
అప్పుడప్పుడూ తలనొప్పి వస్తుందంటే అది పెద్ద విషయమేమీ కాదు. కానీ, తరచూ ఒకే సమయంలో వస్తోందంటే కాస్తా ఆలోచించాల్సిన విషయమే. మీరు తీసుకున్న ఆహారంలో తగినన్ని కార్బోహైడ్రేట్లు లేకపోతే తలనొప్పికి ఆస్కారముంది. ఈ కార్బోహైడ్రేట్లే గ్లూకోజ్‌గా మారి మన శరీరానికి శక్తినిస్తాయి. అందువల్ల మనం తినే ఆహారంలో తగినంత పిండిపదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి. బ్రౌన్‌ రైస్‌, ఓట్స్‌ మీ భోజనంలో భాగమయ్యేటట్లు చూసుకోవాలి.

7.కప్పు కాఫీ లేదా టీ
బాగా అలసటకు గురైప్పుడు కప్పు కాఫీ, లేదా టీ తాగి చాలా మంది రిలాక్స్‌గా ఫీలవుతారు. ఇది వారి మానసిక భావన అని కొందరు వాదిస్తుంటారు. కానీ, కాఫీ, టీలో ఉండే కెఫిన్‌ అనే పదార్థం రక్త కణాలను కాసేపు విశ్రాంతి నిచ్చేలా చేస్తుంది. ఫలితంగా శరీరమంతా రిలాక్స్‌ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. అందువల్ల మనకు తలనొప్పి, అలసట తగ్గినట్లనిపిస్తుందని మరి కొందరు చెబుతుంటారు. అయితే అతిగా టీ తాగడం వల్ల కెఫిన్‌ స్థాయిలు పెరిగిపోవడం కూడా తలనొప్పి రావొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

8. నువ్వుల ఉపయోగమెంతో..
మనం రోజూ తినే ఆహరంలో నువ్వులు ఉండేలా చూసుకుంటే తలనొప్పి వచ్చే అవకాశమే లేదంటున్నారు నిపుణులు. నువ్వుల్లో విటమిన్‌-ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని ఈస్ట్రోజన్‌ స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. మహిళల్లో పీరియడ్స్‌ టైంలో వచ్చే తలనొప్పి దీనివల్ల తొందరగా నయమవుతుంది. అలాగే నువ్వుల వల్ల శరీరంలో నైట్రస్‌ ఆక్సైడ్‌ తయారై రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఫలితంగా తలనొప్పి తగ్గేందుకు అవకాశాలుంటాయి.

-ఇంటర్నెట్‌డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని