‘సైబ్‌-హర్‌’తో మరో అద్భుతం: కేసీఆర్‌

కరోనా వైరస్‌ వ్యాప్తితో తీవ్ర భయాందోళనకు గురవుతున్న ప్రజలు ఇంటర్నెట్‌ వినియోగం వైపు మొగ్గు చూపడంతో సైబర్‌ నేరగాళ్లు పెట్రేగిపోతున్న......

Published : 14 Aug 2020 15:35 IST

మహిళా భద్రతా విభాగానికి కేసీఆర్‌ అభినందనలు

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తితో తీవ్ర భయాందోళనకు గురవుతున్న ప్రజలు ఇంటర్నెట్‌ వినియోగం వైపు మొగ్గు చూపడంతో సైబర్‌ నేరగాళ్లు పెట్రేగిపోతున్న వేళ తెలంగాణ మహిళా భద్రతా విభాగం చేపట్టిన కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. ముఖ్యంగా మహిళలు, ఆన్‌లైన్‌ చదువుల్లో నిమగ్నమైపోయిన విద్యార్థులు ఈ నేరాల బారిన పడే ప్రమాదం ఉన్నందున ‘సైబ్‌-హర్‌’ పేరుతో చేపట్టిన ఆన్‌లైన్‌ అవగాహన కార్యక్రమంపై ఆయన స్పందించారు. నెల రోజుల పాటు ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించి దాదాపు 15లక్షల మందికి సైబర్‌ నేరాలు జరిగే విధానం, దాని బారినపడకుండా ఉండేందుకు అవసరమైన రక్షణ మార్గాలపైనా, అప్రమత్తతపైనా అవగాహన కల్పించిందని సీఎం లేఖలో పేర్కొన్నారు. సైబర్‌ నేరాలకు సంబంధించిన ప్రత్యేక పుస్తకాలను వెలువరించిందన్నారు. మహిళలు, పిల్లల భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్రం ‘సైబ్‌-హర్‌’ పేరుతో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంతో మరో అద్భుతం సాధించిందన్నారు. దీన్ని నిర్వహించిన రాష్ట్ర పోలీస్‌శాఖ మహిళా భద్రతా విభాగాన్ని మనసారా అభినందిస్తున్నట్టు లేఖలో తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఇటీవల రాసిన ఈ లేఖను డీజీపీ మహేందర్‌ రెడ్డి విడుదల చేశారు. మహిళా భద్రతా విభాగం నిబద్ధత, కృషికి ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు వచ్చాయని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు