రోజుకు 24 స్లాట్లు మాత్రమే: సోమేశ్‌ కుమార్‌

రాష్ట్రంలో నూతనంగా తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌ అన్నారు.

Published : 12 Dec 2020 01:42 IST

స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియను ప్రారంభించిన సీఎస్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో నూతనంగా తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌ అన్నారు. ఈ విధానంలో రిజిస్ట్రార్లు సహా అధికారులెవరికీ ఎలాంటి విచక్షణాధికారాలు ఉండవని సీఎస్‌ స్పష్టం చేశారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్లు మాత్రమే బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్ సంఖ్య ఇవ్వని వారికోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ తర్వాత ఆన్‌లైన్‌లో మ్యుటేషన్ వెంటనే జరుగుతుందని.. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్‌ తర్వాత వెంటనే డాక్యుమెంట్లు ఇస్తామని.. ఈ-పాస్‌బుక్‌, ఆరెంజ్‌ రంగు పాసుపుస్తకాలు కూడా జారీ చేయనున్నట్లు సీఎస్‌ వివరించారు.

ఎల్‌ఆర్ఎస్‌ లేనివారి విషయంలో కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎస్‌ తెలిపారు. ఇళ్లు, ఫ్లాట్లతో పాటు ఓపెన్‌ ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్నారు. పెండింగ్‌ మ్యుటేషన్లు ధరణిలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. గతంలో 16 లక్షల లావాదేవీలు జరిగితే వాటిలో 10 వేలు మాత్రమే స్లాట్‌ బుకింగ్‌ ద్వారా జరిగేవని.. ప్రస్తుతం వంద శాతం స్లాట్‌ బుకింగ్‌ ద్వారానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు సోమేశ్‌ కుమార్‌ వివరించారు. దాదాపు 96 శాతం సేవలు ప్రారంభించామని.. మిగతావి కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని సీఎస్‌ వెల్లడించారు.

డేటా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు సీఎస్‌ తెలిపారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు 100 మంది అధికారులు, నిపుణులతో బీఆర్కే భవన్‌లో వార్‌ రూం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి 24 గంటల కాల్‌సెంటర్‌ సేవలు అందుబాటులో ఉంటాయని.. 1800-599-4788 నంబర్‌కు కాల్‌ చేసి సమస్యలు వివరించవచ్చని సోమేశ్‌ కుమార్‌ తెలిపారు.

ఇదీ చదవండి..

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అనుమతి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని