గాలి ద్వారానూ కరోనా వ్యాప్తి!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. దీనికి వ్యాక్సిన్‌ను కనుకగొనేందుకు పలు కంపెనీలు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. మరోవైపు ఈ వైరస్‌ ఎలా వ్యాపిస్తోందన్న దానిపై స్పష్టత లేదు. మరీ ముఖ్యంగా ఈ మహమ్మారి గాలి ద్వారా వ్యాపిస్తుందా?లేదా? అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం దొరకడం లేదు...

Updated : 06 Oct 2020 11:50 IST

వాషింగ్టన్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. దీనికి వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు పలు కంపెనీలు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. మరోవైపు ఈ వైరస్‌ ఎలా వ్యాప్తి చెందుతోందన్నదానిపై స్పష్టత లేదు. మరీ ముఖ్యంగా ఈ మహమ్మారి గాలి ద్వారా వ్యాపిస్తుందా?లేదా? అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం గాలి ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందగలదని స్పష్టమైంది. అయితే ఈ విషయాన్ని సీడీసీ గతంలోనూ చెప్పింది. తన అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారాన్ని పెట్టి మళ్లీ తొలగించింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల సమాచారాన్ని తొలగించినట్లు చెప్పిన సీడీసీ తాజాగా మరోసారి గాలిద్వారా వ్యాప్తి చెందుతుందన్న విషయాన్ని నిర్ధారించింది. ఈ మేరకు అక్కడి ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

కరోనా సోకిన వ్యక్తి దగ్గినపుడు, తుమ్మినపుడు వెలువడిన తుంపర్లలో వైరస్‌ ఉంటుందని, అది గాలి ద్వారా ప్రయాణించి వేరొకరికి సోకే అవకాశముంటుందని సీడీసీ వెల్లడించింది. అయితే సాధారణంగా తుంపర్లు కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత పేలిపోయి, వైరస్‌ నేలపై పడిపోతుంది. అలాంటప్పుడు 6 అడుగుల దూరం లోపల ఉన్న వారికి వైరస్‌ సోకే అవకాశముంటుంది. మరోవైపు గాలి, వెలుతురు సక్రమంగా ప్రసరించని చోట్ల తుంపర్ల ద్వారా కనీసం 2 మీటర్ల కంటే ఎక్కువ దూరం వైరస్‌ ప్రయాణించగలదని సీడీసీ వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో 6 అడుగుల కంటే ఎక్కువ దూరం ఉన్నప్పటికీ వైరస్‌ వ్యాప్తి ప్రభావం ఎక్కువగా ఉంటుందని తేల్చింది.

అయితే వైరస్‌ గాలిలో ఎంతసేపు బతికుంటుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీని వ్యవధి కొన్ని సెకెన్ల నుంచి గంటల వరకు ఉండొచ్చని సీడీసీ అభిప్రాయపడింది. గాలి వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు తుంపర్లు తొందరగా పేలిపోవడం గానీ, ఆవిరవడం కానీ జరుగుతుంది. దీనివల్ల వైరస్‌ తొందరగా నశించిపోయి వ్యాప్తి తీవ్రత తగ్గుతుందని సీడీసీ తెలిపింది. మనం తిరిగే చోట్ల గాలి వెలుతురు సక్రమంగా ప్రసరించేలా జాగ్రత్త పడాలని సూచించింది. వైరస్‌ సోకిన వ్యక్తులు తుమ్మినపుడు, దగ్గినపుడు వేలకొద్దీ తుంపర్లు వెలువడతాయని.. అందువల్ల కనీసం 6 అడుగుల దూరం పాటిస్తూ.. మాస్కులు, శానిటైజర్లు వాడాలని అక్కడి ప్రజలకు సీడీసీ సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని