రెచ్చగొట్టే పోస్టులు ఫార్వర్డ్‌ చేయొద్దు: డీజీపీ

గ్రేటర్ ఎన్నికలను ఆసరాగా తీసుకొని విధ్వంసక శక్తులు మత కల్లోలాలకు కుట్ర చేస్తున్నాయని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగేలా వ్యవహిరిస్తే కఠినచర్యలు తప్పవని.. కుట్రలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

Updated : 12 Oct 2022 15:26 IST

హైదరాబాద్‌: గ్రేటర్ ఎన్నికలను ఆసరాగా తీసుకొని విధ్వంసక శక్తులు మత కల్లోలాలకు కుట్ర చేస్తున్నాయని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగేలా వ్యవహిరిస్తే కఠినచర్యలు తప్పవని.. కుట్రలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. అలాంటి చర్యలను పోలీసుశాఖ అణచివేస్తుందన్నారు. తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. సామాజిక మాధ్యమాల ద్వారా అశాంతి సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఆయా పోస్టులపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచుతున్నట్లు స్పష్టం చేశారు. రెచ్చగొట్టే పోస్టులను ఫార్వర్డ్‌ చేయొద్దని ప్రజలకు మహేందర్‌రెడ్డి సూచించారు. 

వదంతులు, నకిలీ వార్తల గురించి తెలిస్తే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలన్నారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో నేతల ప్రసంగాలను నిశితంగా పరిశీలిస్తున్నామని.. రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు సుమారు 50 మందిపై ఈ తరహా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. వీటిపై న్యాయసలహా తీసుకుని దర్యాప్తు చేస్తామన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలంతా సహకరించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని