ప్రాజెక్టులకు తగ్గిన వరద ప్రవాహం

పది రోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద, భారీ వర్షాలతో కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కాగా, రెండు రోజుల నుంచి వర్షాలు కాస్త తగ్గడంతో క్రమంగా వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు..

Published : 24 Aug 2020 12:00 IST

హైదరాబాద్‌: పది రోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద, భారీ వర్షాలతో కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కాగా, రెండు రోజుల నుంచి వర్షాలు కాస్త తగ్గడంతో క్రమంగా వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. దీంతో గేట్ల నుంచి నీటి విడుదలను అధికారులు తగ్గిస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో 2,88,230 క్యూసెక్కులు ఉండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎనిమిది గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 2.19లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచి పెడుతున్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 208.28టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

మరోవైపు నాగార్జున సాగర్‌ వద్ద కూడా నీటి విడుదలను అధికారులు క్రమంగా తగ్గిస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌కు 1.54లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో ఎనిమిది గేట్లు పది అడుగుల మేర ఎత్తి 1.15లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయం మొత్తం 590 అడుగులకు గాను ప్రస్తుతం 587 వద్ద నియంత్రణ చేస్తున్నారు. సాగర్‌ పూర్తి నీటి నిల్వ 312.04టీఎంసీలు కాగా, ప్రస్తుతం సాగర్‌లో 305.50 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 

గోదావరికి తగ్గిన వరద ప్రవాహం..
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గడంతో భద్రాలచంలో గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సుమారు 12 అడుగుల మేర నీటి మట్టం తగ్గినట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం వరకు 42.6 అడుగుల వద్దకు నీటి మట్టం చేరుకుంది. నీటి మట్టం తగ్గడంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని