
ఘాజీపూర్ డంప్యార్డులో ఆగని మంటలు
దేశ రాజధానిపై తీవ్ర ప్రభావం
దిల్లీ: ఇప్పటికే దిల్లీ వాయునాణ్యత అత్యల్పానికి పడిపోయిన నేపథ్యంలో ఘాజీపూర్ డంప్యార్డులో చెలరేగిన మంటలు సమస్యను ఇంకా జటిలం చేస్తున్నాయి. దిల్లీ అగ్నిమాపకదళ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 9.56 గంటల సమయంలో ఈ ఘటన గురించి సమాచారం అందింది. ఈ ప్రాంతంలో మండే స్వభావం ఉన్న అనేక వస్తువులు ఉండటంతో మంటలు అదుపులోకి తేవడం కష్టంగా మారిందని తెలిపారు. ప్రస్తుతానికి మంటలు వేరే ప్రాంతాలకు వ్యాపించడం ఆగింది కానీ పూర్తిగా ఆగలేదని వారు వెల్లడించారు. సంఘటనా స్థలంలో తొమ్మిది అగ్ని మాపక యంత్రాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. మంటలు ఎక్కువగా రేగడంతో బుధవారం తెల్లవారుజామున దిల్లీ వాయునాణ్యత 401కు చేరింది. మధ్యాహ్నానికి 406కు చేరి అత్యంత ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ఘటనా స్థలానికి దగ్గర్లో ఉన్న పత్పర్గంజ్లో 423, ఆనంద విహార్ ప్రాంతాల్లో 445 గా వాయునాణ్యత నమోదైందని కేంద్ర కాలుష్యనివారణ బోర్డు నివేదిక తెలిపింది. కాగా ఇప్పటివరకూ ఘటనకు సంబంధించిన సహాయక చర్యల గురించి దిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్రాయ్ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.