హేమంత్‌ హత్య కేసులో వాంగ్మూలం నమోదు

సంచలనం సృష్టించిన హేమంత్‌ హత్య కేసులో మంగళవారం గచ్చిబౌలి పోలీసులు అతని భార్య అవంతితోపాటు తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. గచ్చిబౌలి ఠాణాలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం....

Updated : 30 Sep 2020 07:16 IST

గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ నుంచి బయటకు వస్తున్న అవంతి, హేమంత్‌ తల్లిదండ్రులు

గచ్చిబౌలి, శేరిలింగంపల్లి : సంచలనం సృష్టించిన హేమంత్‌ హత్య కేసులో మంగళవారం గచ్చిబౌలి పోలీసులు అతని భార్య అవంతితోపాటు తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. గచ్చిబౌలి ఠాణాలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. ప్రేమ, పెళ్లి తదనంతర పరిణామాలకు సంబంధించి వారు చెప్పిన అన్ని వివరాలను పోలీసులు నమోదు చేశారు. అనంతరం అవంతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘నా భర్త హత్యకు సంబంధించి పోలీసులకు అన్ని విషయాలు చెప్పాను. హేమంత్‌ కిడ్నాప్‌ అయినప్పుడు రక్షించడానికి పోలీసులు కృషి చేసినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నాకు ప్రాణహాని ఉందన్న విషయం పోలీసులకూ తెలుసు. తప్పకుండా రక్షణ కల్పిస్తారనే నమ్మకం ఉంది. హేమంత్‌ హత్య కేసులో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నాను. అలాగే హేమంత్‌కి సంబంధించిన చరవాణి, పోస్ట్‌మార్టం నివేదిక అందించాల’ని కోరినట్లు తెలిపారు. కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని కోరినట్లు.. ఇందుకు సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ అంగీకరించి సానుకూలత వ్యక్తం చేసినట్లు వివరించారు.

ఇంటి దగ్గర పోలీసు పికెటింగ్‌..

అనుమానిత వ్యక్తులు నిత్యం తమ రాకపోకలపై రెక్కీ నిర్వహిస్తున్నట్లు అవంతి ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో చందానగర్‌ సీఐ రవీందర్‌ ఆధ్వర్యంలో తారానగర్‌లోని ఇంటివద్ద పోలీసుల పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. 24 గంటలు పోలీసు పహారా ఉంటుందని సీఐ తెలిపారు. లక్ష్మారెడ్డి ఇంటితోపాటు అవంతి ఉంటున్న భవనం ప్రాంతానికి పికెటింగ్‌ కొనసాగుతుందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని