వినాయక పూజలో విశేషాలెన్నో!

వక్రతుండ మహాకాయ! కోటిసూర్య సమప్రభ! నిర్విఘ్నం కురు మే దేవ! సర్వకార్యేషు సర్వదా... అంటూ ఎంతో భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించే

Published : 23 Aug 2020 02:35 IST

వక్రతుండ మహాకాయ! కోటిసూర్య సమప్రభ! నిర్విఘ్నం కురు మే దేవ! సర్వకార్యేషు సర్వదా... అంటూ ఎంతో భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించే పర్వదినం వినాయక చవితి. ఈ రోజున పాలవెల్లిని అలంకరించడం, పత్రితో పూజ చేయడం, కుడుములను నైవేద్యం పెట్టడం... భక్తి శ్రద్ధలతో కథ వినడం... అన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి. అయితే వాటికి కొన్ని అంతరార్థాలు ఉన్నాయనీ... జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగడానికి ఉపయోగపడతాయనీ వివరిస్తున్నారు మహా సహస్రావధాని డా॥ గరికపాటి నరసింహారావు.

ఏటా భాద్రపద మాసం, శుద్ధ చవితి రోజున జరుపుకొనే వినాయక చవితి పండగలో ప్రకృతి ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తుంది. మనం తెలుసుకుని, పిల్లలకు చెప్పడానికి ఉపయోగపడే అంశాలెన్నో కళ్లకు కడతాయి. వినాయకుడి రూపమే ప్రకృతికి సమీపంగా ఉంటుంది. ఆయన గజముఖుడు. గజం అంటే ఏనుగు. అది శాకాహారి. రుచికరమైన చెరుకును ఇష్టంతో తింటుంది. శాకాహారులు బలహీనంగా ఉంటారనడాన్ని అబద్ధం చేసేది ఏనుగే. అత్యంత శక్తిమంతమైన జంతుజాలంలో ఏనుగు ఒకటి. ప్రకృతి బలమే ఏనుగు బలం. విఘ్నాధిపతి అర్చనలోనూ ప్రకృతి పాత్రే కీలకం. ప్రకృతిలో దొరికిన ప్రతీ ఆకూ స్వామి వారి అర్చనకు అర్హమైందే అన్నది ఈ పండగ ద్వారా తెలుస్తుంది. వినాయకుడి విగ్రహాన్ని మట్టితోనే చేయాలంటారు. దానికీ కారణం ఉంది. సాధారణంగా వానలు ఆషాడం నుంచి మొదలై శ్రావణం, భాద్రపదం వరకూ కురుస్తాయి. భాద్రపదంలో తక్కువగా కురిసినా చెరువులు నిండిపోతాయి. వాటిల్లో చేరిన నీరు పైకి పొంగితే ప్రమాదం. అందుకే ఆ చెరువుల్లో ఉన్న మట్టిని పూడిక తీసి దాంతో వినాయకుడి విగ్రహాన్ని తయారుచేస్తారు. ఇలా పూడిక తీయడం వల్ల అదనంగా చేరిన నీరంతా లోపలికి ఇంకుతుంది. అయితే వూరికొక విగ్రహం కాకుండా... ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో ఓ మట్టిబొమ్మను స్వయంగా చేసుకుని పూజ చేసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నాయి పురాణాలు. పైగా మట్టి అంటే శ్రేష్ఠమైన భావన. తొమ్మిది రోజులయ్యాక ఆ విగ్రహాన్ని మళ్లీ అదే నీళ్లలో కలుపుతారు. దాంతో తీసిన పూడిక మొత్తం సర్దుకుంటుంది.

ప్రతి భాగమూ పాఠమే..

వినాయకుని వృత్తాంతం, ఆయన రూపం, మట్టిలో పుట్టి మట్టిలో కలసిపోయే స్వభావం... అనేక విషయాలను తెలియజేస్తాయి. చాటంత చెవులూ, పెద్ద పొట్ట, చిన్ని కళ్లూ, ఏనుగు ముఖం, నోటికి అడ్డంగా తొండం... వీటిలో ప్రతి దాని వెనకా ఓ పరమార్థం ఉంది. తక్కువ మాట్లాడమని నోటికి ఆడ్డుగా ఉన్న తొండం సూచిస్తే, ఎవరు చెప్పినా శ్రద్ధగా వినాలని చెవులూ, ఆ విన్న వాటిని భద్రంగా దాచుకోవాలని కడుపూ చెప్పకనే చెబుతాయి. వినాయకుడి సూక్ష్మ దృష్టికి నిదర్శనం అతని చిన్ని కళ్లు. ముక్కోటి దేవతలూ తల్లిదండ్రుల తరవాతే అని తన అంతర్నేత్రంతో గ్రహించాడు కాబట్టే వాళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేసి సకల దేవతలనూ మెప్పించాడు. విఘ్నాధిపతిగా అవతరించాడు. ఏదైనా కార్యం సాధించాలంటే కావల్సింది శక్తియుక్తులే కానీ సౌకర్యాలూ, ఆర్భాటాలూ కావని అతని ఎలుక వాహనం సూచిస్తుంది. ఇలా గణపతి అణువణువులో ఒక్కో విశిష్టత దాగుంది.

దొరికిన వాటితోనే అలంకరణ..

పాలవెల్లిని గమనిస్తే.. ఈ పండక్కి చేసే అలంకరణలన్నీ సహజంగానే ఉంటాయి. వెల్లి అంటే ప్రవాహం. పాలవెల్లి అంటే పాల ప్రవాహం. దానికి కట్టే మొక్కజొన్న, వెలగ, జామకాయ, సీతాఫలం అన్నీ పాలకంకుల దశలోనే ఉంటాయి. ఎందుకంటే.. ఆషాడంలో విత్తనాలు వేస్తారు. భాద్రపద సమయానికి పంట లేత దశలోకి వస్తుంది. ఈ కాలంలో అవే ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి.. అవి ఎలా ఉన్నాయో వాటితోనే పూజ చేయమంటారు. వినాయకుడు ఎప్పుడూ బాలుడే. అందుకే ఆ దశలో ఉన్నవే కట్టాలని కూడా పురాణాలు చెబుతున్నాయి. వినాయకుడి పూజకు వాడే పత్రిలో ఆకులూ, కాయలూ, పువ్వులూ, పండ్లూ ఉంటాయి. వీటిలో ఎనలేని ఔషధగుణాలుంటాయి. కేవలం వాటిని తాకడం వల్లే కొన్ని రకాల వ్యాధులు నయం అవుతాయి. కొన్ని రకాల ఆకులు గదిలో ఒక విధమైన పరిమళాన్నిస్తూ ఆరోగ్యకరమైన ప్రాణవాయువును అందిస్తాయి. అందుకే, ఇరువది యొక్క పత్రముల నీశ్వరపుత్రుని పూజచేయుటన్‌... పరమ రహస్యమీ ప్రకృతి పావనభావనయే గదా! విష జ్వరములు వింతవ్యాధుల నివారణ కియ్యవి కల్పవృక్షముల్‌... అంటారు. పూర్వం ఆయుర్వేద వైద్యం చేసే ఆచార్యులకు మాత్రమే వీటి గుణాలు తెలుసు. అవి అందుబాటులో ఉండి, వైద్యానికి ఉపయోగపడాలంటే వాటి గురించి అందరికీ తెలియాలి. అందుకే చవితికి అవసరమైన పత్రిని ఇరుగుపొరుగు వారిళ్లకు వెళ్లి తెచ్చుకోమంటారు. దానివల్ల ఎవరింట్లో ఎలాంటి ఔషధ మొక్కలున్నాయనేది తెలుస్తుంది. ఈ పత్రిని పిల్లలు సేకరించేలా పెద్దవాళ్లు ప్రోత్సహిస్తారు. మాచీ, బిల్వ, శమీ, మారేడు, బృహతీ, బదరీ, కరవీరా, దాడిమీ, జాజి, విష్ణుక్రాంత, చూత... ఇలా పత్రి అంతా కలిపి ఇరవై ఒకటి ఉంటాయి. అవన్నీ పూజలో ఉపయోగించడానికి ఒకవిధంగా వర్షాకాలమే కారణం.

ఈ కాలంలో ఆకులూ, పువ్వులూ రాలిపోతాయి. గుంటల్లో నీళ్లు నిలిచి సూక్ష్మక్రిములు వ్యాప్తి చెంది, అవి వ్యాధుల్ని తెచ్చిపెడతాయి. ఇలాంటి సమయంలో వినాయకుడికి ఔషధ గుణాలున్న పత్రితో పూజ చేయడం వల్ల ఇంట్లో వాతావరణం బాగుండి, అవి నశిస్తాయి. దానికితోడు ఔషధగుణాలున్న పత్రి నుంచి వచ్చే గాలిని తొమ్మిది రోజుల పాటు పీలుస్తాం. తరవాత నిమజ్జనం చేసినప్పుడు పత్రిలోని ఔషధ గుణాలలో కొన్నయినా ఆ నీటిలో చేరతాయి. ఆ రకంగా నీటిలోని క్రిములు నశిస్తాయి. ఆ నీటిని తాగినప్పుడు అనారోగ్యాలు కలగవు. పత్రిలోని ఒక్కొక్క రకంతో ఒక్కో ఉపయోగం. తులసి శ్వాస సంబంధ, కఫం రోగాలను తగ్గిస్తుంది. జిల్లేడు చర్మ, శ్వాసకోశ వ్యాధుల్ని నివారిస్తుంది. బిల్వపత్రం సూక్ష్మక్రిములను హరిస్తుంది. గరిక ముక్కుసంబంధమైన అనారోగ్య సమస్యల్ని తగ్గిస్తుంది. ఇంటిల్లిపాది ఆరోగ్యాన్నీ దృష్టిలో పెట్టుకునే వినాయకుడికి అలాంటి ఆకుల్ని పూజకు అర్పిస్తారు.

ఈ పండగలో గరిక పూజకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ పూజను దూర్వాయుగ్మ పూజ అంటారు. యుగ్మం అంటే జంట అని అర్థం. గరిక అంటే గడ్డి. అంటే జతగా ఉన్న గడ్డి పరకను వినాయకుడికి సమర్పించాలి. ఇతర పత్రిని తాజాగా, శుభ్రం చేసినవి ఎంచుకుంటే... గరికను మాత్రం శుభ్రం చేయకుండానే వేయాలి. దీనికి, ఉన్నంతలోనే పూజ చేయాలనేది ఒక అర్థమైతే.. గడ్డి కూడా దేవుడి పూజకు పనికొస్తుందని చెప్పడమే దీని ప్రధాన ఉద్దేశం.

ఆవిరి పదార్థాలతో ఆరోగ్యం..
యదన్నం పురుషో భుంక్తే తదన్నాః తస్యదేవతాః అన్నారు. పురుషుడు అంటే మనిషి అని అర్థం. ఈ కాలంలో మనిషి ఏయే పదార్థాలు తీసుకుంటాడో వాటినే దేవతలకూ నైవేద్యంగా పెట్టాలి. అన్నం కావచ్చు.. మరొకటి కావచ్చు.. ఇంట్లో వండుకున్న దాన్నే భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి. ఉండ్రాళ్లూ, కుడుములు కూడా అందులో భాగమే. ఈ కాలంలో జఠరాగ్ని పనితీరు మందగిస్తుంది. దాంతో ఏవి పడితే అవి, ముఖ్యంగా నూనెతో చేసిన పదార్థాలు తింటే జీర్ణం కాకపోగా ఇతర సమస్యలొచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో నూనెతో చేసిన వాటిని తగ్గించి తేలిగ్గా జీర్ణమయ్యేవి ఎంచుకోవాలి. ఈ పండగరోజున ఉండ్రాళ్లూ, కుడుములు లాంటి ఆవిరిపై ఉడికించిన పదార్థాలనే ఎక్కువగా తినాలి. శ్రద్ధగా దేవుడికి నివేదించాలి. కేవలం ఈ పండగ రోజు మాత్రమే కాకుండా ఈ కాలమంతా అలాంటి పదార్థాలు తింటేనే మంచిది. ఇలా నవరాత్రులూ వినాయకుడిని పూజించాక నిమజ్జనం చేస్తాం. మజ్జనం అంటే మనం స్నానం చేయడం. నిమజ్జనం అంటే మరొకరికి చేయించడం. చెరువు నుంచి తీసిన మట్టితో చేసిన విగ్రహాన్ని మళ్లీ నీళ్లల్లోనే కలిపేయడం అన్నమాట. ఒక్కమాటలో చెప్పాలంటే మానవజాతి ప్రగతిలో ప్రకృతి పాత్ర కూడా గొప్పదేనన్న సత్యం ఈ పండగ ద్వారా తెలుస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని