డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి హరివంశ్‌ నామినేషన్‌

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పదవి కోసం జనతాదళ్‌  యునైటెడ్‌(జేడీయూ) ఎంపీ హరివంశ్‌ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

Published : 09 Sep 2020 22:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పదవి కోసం జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీయూ) ఎంపీ హరివంశ్‌ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. థావర్‌చంద్‌ గహ్లోత్, నరేష్‌ గుజ్రాల్‌ వంటి నేతల సమక్షంలో ఆయన నామినేషన్‌ వేశారు. సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ ఒకటో తేదీ వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి ఈ నెల ఏడో తేదీన ప్రారంభమైన నామినేషన్‌ ప్రక్రియ 11వ తేదీ వరకు జరగనుంది. 
2018లో కాంగ్రెస్‌ నేత బీకే హరిప్రసాద్‌ను ఓడించి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్‌ ఎన్నికయ్యారు. ఈ ఏడాదితో పదవీకాలం ముగయనుండటంతో మరోసారి పోటీలో ఉన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, తెరాస, జేడీయూ వంటి పార్టీల అండతో 140 మంది ఎంపీల మద్దతు తమకు లభిస్తుందని, హరివంశ్‌ తిరిగి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నిక కానున్నారని భాజపా ధీమాతో ఉంది. 245మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రస్తుతం ఎన్డీయేకు 113 మంది సభ్యుల బలం ఉంది. హరివంశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు భాజపా యత్నిస్తోంది. కాంగ్రెస్‌ మాత్రం విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని