కృష్ణా నదికి కొనసాగుతున్న వరద ఉద్ధృతి

కృష్ణా నదికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. పులిచింతల నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.

Published : 27 Sep 2020 20:52 IST

అమరావతి: కృష్ణా నదికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. పులిచింతల నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ ఇన్‌ ఫ్లో 5.11లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్‌ ఫ్లో 5.06లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఈ రాత్రికి వరద ఉద్ధృతి 8లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బ్యారేజీ దిగువ ప్రాంతాలకు పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరుతోంది. యనమలకుదురు, పెదపులిపాక, కేసరనేనివారిపాలెం, మద్దూరు ప్రాంతాల్లో కృష్ణానదిని ఆనుకుని ఉన్న పంటపొలాలు జలమయమయ్యాయి. నదికి సమీపంలోని నివాసాలు, ఆలయాల్లోకి కూడా వరద నీరు చేరింది. నదీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదిలో జలకళ కొనసాగుతోంది. 

వరద ఉద్ధృతి నేపథ్యంలో కృష్ణా జిల్లా అధికారులతో కలెక్టర్‌ ఇంతియాజ్‌ సమీక్ష నిర్వహించి అప్రమత్తం చేశారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. కృష్ణా నదికి భారీగా వరద వస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ ఆదేశించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో మంత్రి మాట్లాడి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని.. పునరావాస చర్యలు చేపట్టాలని సూచించారు. కడప, కర్నూలు, అనంతపురం అధికారులతోనూ మంత్రి ఫోన్లో మాట్లాడారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.  
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని