రేపటి నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం

ప్రముఖ శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని రెండు నెలల మండల పూజలో భాగంగా ఆదివారం సాయంత్రం తెరిచారు. సోమవారం ఉదయం నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతి ఇవ్వనున్నట్లు ట్రావెన్‌కోర్‌ ఆలయ బోర్డు

Updated : 12 Mar 2024 16:03 IST

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని రెండు నెలల మండల పూజలో భాగంగా ఆదివారం సాయంత్రం తెరిచారు. సోమవారం ఉదయం నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతి ఇవ్వనున్నట్లు ట్రావెన్‌కోర్‌ ఆలయ బోర్డు (టీడీబీ) వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి ఆలయ బోర్డు మార్గదర్శకాలను విడుదల చేసింది. నిలక్కల్‌, పంబా బేస్‌ క్యాంప్‌కు చేరుకునే 48 గంటల ముందు చేయించుకున్న పరీక్షలో కరోనా నెగెటివ్‌ రిపోర్టుతో వచ్చిన భక్తులనే దర్శనానికి అనుమతిస్తారు. 

‘వర్చువల్‌ క్యూ’ పద్ధతిలో రిజిస్టర్‌ చేసుకున్న భక్తులను రోజుకు వెయ్యి మంది చొప్పున దర్శనభాగ్యం కల్పిస్తారు. శని, ఆదివారాల్లో 2 వేల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకోవచ్చు. మండల విలక్కు- పూజలో భాగంగా రెండు నెలల పాటు జరిగే పూజా కార్యక్రమాల్లో మొత్తం 85,000 మంది దర్శనం చేసుకునేలా దేవస్థానం బోర్టు ఏర్పాట్లు చేసింది. 10 ఏళ్లలోపు, 60 ఏళ్ల పైబడిన వయస్సు ఉన్న వారిని దర్శనానికి అనుమతించరు. ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో వందల మంది వైద్యసిబ్బంది ఆలయానికి వెళ్లే మార్గాల్లో భక్తులకు కరోనా టెస్టులు చేయనున్నారు. పంబా నదిలో దిగి స్నానాలు చేయడానికి భక్తులకు అనుమతి లేదని ఆలయ వర్గాలు వివరించాయి. ఈ నేపథ్యంలో భక్తులు స్నానాలు చేసేందుకు అనుకూలంగా ప్రత్యేకంగా షవర్లను ఏర్పాటు చేశారు. పంబాబేస్‌ క్యాంపుతో పాటు ఆలయ పరిసరాల్లో భక్తులు బస చేయడానికి వీలు లేదని ట్రావెన్‌కోర్‌ ఆలయబోర్డు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని