
ట్రాక్టర్తో పొలం దున్నిన ముఖ్యమంత్రి
విదిశ: రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే నిత్యం ఫైళ్లు, సమావేశాలు, పర్యటనలతో తీరిక లేకుండా గడపుతుంటారు. ఎప్పుడైనా కాస్త సమయం దొరికితే తమకు ఇష్టమైన పని చేసుకుందామని వేచిచూస్తుంటారు. అలా బుధవారం దొరికిన కాస్త సమయాన్ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయనకు ఇష్టమైన వ్యవసాయ పనులు చేసుకుంటూ గడిపారు. విదిశలోని ఆయన పొలానికి వెళ్లి ట్రాక్టర్తో దుక్కి దున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే స్వయంగా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రైతులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
‘‘వ్యవసాయ పనులు నాకు ఎంతో సంతృప్తినిస్తాయి. దీపావళి సందర్భంగా, విదిశలో పొలం దున్నుతూ మళ్ళీ ఆ ఆనందం పొందాను. రైతుల పంట పొలాలన్నీ కళకళలాడాలనీ, లక్ష్మీదేవి ఆశీర్వాదంతో రాష్ట్రంలోని ప్రతి ఇల్లు ధాన్యం, సంపదతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’’ అని శివరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.
ఇటీవల 28 శాసనసభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో భాజపా అత్యధిక సీట్లు గెలుచుకొని తమ అధికారాన్ని మరింత పటిష్ఠం చేసుకున్న విషయం తెలిసిందే. అధికారం నిలబెట్టుకోవడానికి ఎనిమిది స్థానాల్లో గెలుపొందాల్సి ఉండగా.. భాజపా మొత్తం 19 స్థానాల్లో విజయం సాధించింది.