చిన్నారుల చదువుకోసం ఆవును అమ్మి..!

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు ఇంకా మూసివేసే ఉన్నాయి. మరో కొన్నిరోజులు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చిన్నారులకు ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నాయి పాఠశాలలు.

Updated : 24 Jul 2020 18:59 IST

స్మార్ట్‌ఫోన్‌ కోసం ఆవును అమ్మిన రైతు కుటుంబం
స్పందించిన దాతలు, ఆర్థిక చేయూత

దిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు ఇంకా మూసివేసే ఉన్నాయి. మరి కొన్నిరోజులు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చిన్నారులకు ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నాయి పలు పాఠశాలలు. ఈ పరిణామాలు కొన్ని పేదకుటుంబాలకు భారంగా మారుతున్నాయి. చిన్నారుల ఆన్‌లైన్‌ చదువు కోసం ఓ పేదకుటుంబం వారి జీవనోపాధికి కీలకంగా ఉన్న ఆవునే అమ్మేసిన ఘటన హరియాణాలో చోటుచేసుకుంది.

హరియాణాలోని జ్వాలాముఖి ప్రాంతానికి చెందిన కుల్దీప్‌ కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తోంది. అతనికి రెండు, నాలుగో తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలున్నారు. కుల్దీప్‌ కుటుంబానికి వారు పెంచుతున్న ఓ ఆవు మాత్రమే జీవనాధారం. అయితే, తాజా పరిస్థితులు వారికి సవాలుగా మారాయి. స్మార్ట్‌ఫోన్‌ అంటే తెలియని వారికి, ఆ పిల్లలు చదువుతున్న పాఠశాల నుంచి ఓ కబురు వచ్చింది. ఇకనుంచి చిన్నారులకు ఆన్‌లైన్‌లోనే పాఠాలు చెబుతామని.. స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంచుకోవాలని సమాచారం ఇచ్చారు. దీంతో చేతిలో కనీసం రూ.500కూడా లేని కుల్దీప్‌కు ఇది భారంగా మారింది. అయినప్పటికీ తన చిన్నారుల చదువు కొనసాగించేందుకు స్మార్ట్‌ఫోన్‌ కొనాలని నిర్ణయించాడు. తెలిసిన వారు, ప్రైవేటు ఫైనాన్సర్లను, చివరకు బ్యాంకులను ఆశ్రయించినా తన ఆర్థికస్థితి గమనించి ఎవ్వరూ డబ్బు ఇవ్వలేదు. దీంతో చేసేదేమీ లేక తమ జీవనోపాధిగా ఉన్న ఆవును కేవలం ఆరువేల రూపాయలకు అమ్మేశారు. వచ్చిన డబ్బుతో పిల్లల కోసం స్మార్ట్‌ఫోన్‌ కొన్నాడు.

స్పందించిన దాతలు..
ఈ విషయాన్ని స్థానిక మీడియా వెలుగులోకి తేవడంతో దాతలు స్పందించారు. ఆర్థిక సాయం అందించేందుకు మేమున్నాం అంటూ ముందుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే హరియాణాకు చెందిన ఓ ఐపీఎస్‌ అధికారి పదివేల రూపాయలను కుల్దీప్‌ కుటుంబానికి అందించారు. ఆ మొత్తాన్ని వారి ఖాతాలో జమచేసినట్లు తాజాగా ట్విటర్‌లో వెల్లడించారు. దీనిపై మొబైల్‌ కంపెనీ షామీ కూడా స్పందించింది. వీరికి ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌ అందజేస్తామని ఈ సంస్థ ఎండీ ఎమ్‌కే జైన్ ట్విటర్‌లో ప్రకటించారు. బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ కూడా వారికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని