ప్రతి పదిమందిలో ఒకరి కొలువు హుష్
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా పట్టణప్రాంతాల్లో నిరుద్యోగం తాండవిస్తోంది. అంతకు ముందుతో పోల్చితే కొంత తగ్గినట్లు కనిపించినా,
తెలంగాణలో పరిస్థితి కొంత మెరుగు
నిరుద్యోగ తాజా సర్వేలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా పట్టణప్రాంతాల్లో నిరుద్యోగం తాండవిస్తోంది. అంతకు ముందుతో పోల్చితే కొంత తగ్గినట్లు కనిపించినా, ఆగస్టులో మళ్లీ పెరిగింది. పట్టణాలు, గ్రామాల్లో సగటున ఒక శాతం చొప్పున పెరగడం గమనార్హం. భారతీయ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ సంస్థ (సీఎంఐఈ) సర్వేలో జాతీయ స్థాయి నిరుద్యోగిత రేటు 8.35 శాతంగా నమోదైంది. జులైలో 7.43 శాతం ఉంటే.. ఆగస్టు నాటికి 8.35 శాతానికి చేరింది. పట్టణాల్లో పరిస్థితి దారుణంగా మారుతోంది. వ్యాపారాలు కుదేలు కావడంతో అందులో పనిచేస్తున్నవారి ఉద్యోగాలు పోతున్నాయి. ప్రస్తుతం పట్టణాల్లో ప్రతి పదిమందిలో ఒకరి ఉద్యోగం పోయినట్లు తెలుస్తోంది. వీరిలో 30 ఏళ్లలోపు యువతే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.
తెలంగాణలో 5.8 శాతం..
తెలంగాణలో నిరుద్యోగం రేటు కొంత తగ్గింది. జులైలో 9.1 శాతంగా ఉంటే.. ఆగస్టు నెలాఖరు నాటికి 5.8 శాతానికి తగ్గింది. ప్రస్తుత రేటు లాక్డౌన్కు పూర్వమున్న స్థితికి చేరుకున్నట్లు సీఎంఐఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే హరియాణాలో అత్యధికంగా 33.5 శాతంగా నమోదైంది. ఆ తరువాత త్రిపురలో 27.9 గా ఉంది. మొత్తం 13 రాష్ట్రాల్లో పది శాతానికన్నా ఎక్కువగా ఉంది.
చిల్లిగవ్వ లేకుండా నెలరోజులు..
లాక్డౌన్ సమయంలో పట్టణాల్లోని 52 శాతం మంది కార్మికులు నెలరోజుల పాటు చేతిలో చిల్లిగవ్వ లేకుండానే జీవనం సాగించారు. చేసేందుకు పని లేక, వేతనాలు అందక కష్టాలతో కలిసి బతికారు. ప్రభుత్వాల పరిహారం నాలుగోవంతు మందికి మాత్రమే అందిందని, ఇక అసంఘటిత రంగంలో పనిచేసే వారి పరిస్థితి దయనీయంగా మారిపోయిందని ఒక సర్వేలో వెల్లడైంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (ఎల్ఎస్ఈ), యూకే ఆర్థిక సామాజిక పరిశోధన మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఎల్ఎస్ఈ ఆర్థిక పురోగతి కేంద్రం (సీఈపీ) ఈ అధ్యయనం చేసింది. మే, జూన్, జులై నెలల్లో 18-40 ఏళ్లలోపు పట్టణ కార్మికులు 8,400 మందిని కలిసి వివరాలు సేకరించారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న యువత ఉద్యోగాల కోతను ఎదుర్కొంటోందని ఆ సర్వే నివేదిక వివరించింది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు పట్టణ ఉపాధి హామీ పథకం అవసరమని 70 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆదాయం పడిపోవడంతో చాలామంది పేదరికంలోకి వెళ్లడంతో పాటు దీర్ఘకాల నిరుద్యోగ కష్టాలు ఎదుర్కొనాల్సి వస్తోందని వెల్లడైంది. ఈ కష్టాలు తీర్చేందుకు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాతీయ విధానం అవసరమని అభిప్రాయపడింది.
సర్వేలో వెల్లడైన విషయాలివి...
సర్వే చేసిన నెలల్లో 15.5 శాతం మంది కార్మికులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. మరో 21.7 శాతంమందికి చేసేందుకు పనిలేకుండాపోయింది. కొందరికి ఏప్రిల్ నెలకు వేతనాలు కూడా అందలేదు.
కరోనాకు ముందుతో పోల్చితే ఏప్రిల్, మే నెలల్లో ఆదాయం 48 శాతం పడిపోయింది. కరోనా కారణంగానే ఉద్యోగాలు పోయాయని 90 శాతానికిపైగా అభిప్రాయ పడ్డారు.
మూడునెలల సర్వే కాలంలో 80 శాతం మంది అసంఘటిత రంగం కార్మికులు పనిలేకుండా ఉండిపోయారు. సంఘటిత రంగంలో పనిచేస్తున్నవారిలో ఇది 20 శాతంగా ఉంది.
సీఎంఐఈ సర్వేలో దేశవ్యాప్తంగా
నిరుద్యోగం పరిస్థితి ఇది (అంకెలన్నీ శాతాల్లో)
నెల | పట్టణాలు | గ్రామాలు | జాతీయసగటు |
మార్చి | 9.41 | 8.44 | 8.75 |
ఏప్రిల్ | 24.95 | 22.89 | 23.52 |
మే | 25.79 | 22.48 | 23.48 |
జూన్ | 12.02 | 10.52 | 10.99 |
జులై | 9.15 | 6.66 | 7.43 |
ఆగస్టు | 9.83 | 7.65 | 8.35 |
తెలంగాణలో... |
నెల | నిరుద్యోగరేటు |
మార్చి | 5.8 |
ఏప్రిల్ | 6.2 |
మే | 34.8 |
జూన్ | 15.5 |
జులై | 9.1 |
ఆగస్టు | 5.8 |
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్