తాజ్‌మహల్‌ వీక్షణ.. నిబంధనలు మారాయి

తాజ్‌ మహల్‌ సందర్శనలో ఆన్‌లైన్‌ టికెట్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ను నిరోధించేందుకు పురావస్తు శాఖ నడుంకట్టింది.

Updated : 01 Dec 2020 01:54 IST

ఆగ్రా: తాజ్‌ మహల్‌ సందర్శనలో ఆన్‌లైన్‌ టికెట్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ను నిరోధించేందుకు భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఒక వ్యక్తి.. ఐదుగురు పెద్దవారు, ముగ్గురు చిన్నారులకు మాత్రమే టికెట్లను బుక్‌ చేసుకోగలిగేలా నిబంధనలను సవరించింది. కాగా, గతంలో ఈ సంఖ్య 20గా ఉండేది. అంతేకాకుండా ఆన్‌లైన్‌ టికెట్లను బుక్‌ చేసుకునేప్పుడు ప్రతి పర్యాటకుడి వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని.. వాటిని టికెట్లపై పొందుపరుస్తామని అధికారులు వివరించారు. ఇక పదిహేను సంవత్సరాలలోపు చిన్నారులకు ఎప్పటిలాగే ఉచితమని వారు తెలిపారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా మార్చి 17న మూతపడిన తాజ్‌ను.. తిరిగి సెప్టెంబర్‌ 21 న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐతే గతంలో మాదిరిగా  కాకుండా రోజుకు కేవలం ఐదు వేల మందిని మాత్రమే, అది కూడా రెండు స్లాట్లలో అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు తాజ్‌ సందర్శన ఆన్‌లైన్‌ టికెట్లను భారీగా బుక్‌ చేసుకుని.. వాటిని బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరకు విక్రయిస్తున్నారని పర్యాటకుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ నిబంధనలను మార్చినట్టు అధికారులు వివరించారు. అయితే ఇది తాజ్‌ పర్యాటకాన్ని వెనక్కి తీసుకెళ్లే నిర్ణయమని.. టూరిజం రంగానికి చెందిన స్థానికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని