జీహెచ్‌ఎంసీలో వరదసాయానికి ఎస్ఈసీ బ్రేక్‌

జీహెచ్‌ఎంసీ పరిధిలో వరద సాయం పంపిణీ నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశించింది. గ్రేటర్‌ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున...

Updated : 19 Nov 2020 19:55 IST

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో వరద సాయం పంపిణీ నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశించింది. గ్రేటర్‌ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున బాధితుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, వరదసాయం పంపిణీని నిలిపివేయాలని ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగిసిన తర్వాత సాయాన్ని యథావిధిగా కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. 

నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల ఆర్థికసాయం అందజేస్తోంది. ప్రభుత్వం అందించే సాయంకోసం బాధితులు ‘మీ సేవ’ కేంద్రాల వద్ద బారులు తీరారు. వరదల సమయంలో రాష్ట్ర మంత్రులు, అధికారులు బాధితులకు స్వయంగా ఆర్థిక సాయం అందజేశారు. అయితే కొన్ని చోట్ల సాయం అందడంలేదని ప్రజాప్రతినిధులు.. ప్రభుత్వ సొమ్మును కొందరికి మాత్రమే అందజేశారని బాధితులు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన  ప్రభుత్వం సాయం అందని వారు ‘మీ సేవ’ కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా సూచించింది. దీంతో నగరంలోని అన్ని చోట్ల ఆయా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా గ్రేటర్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున వరద సాయం పంపిణీని నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది.

ఇదీ చదవండి..

మీ సేవ కేంద్రాల్లో జనజాతర 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని