వారిపై కరోనా ప్రభావం చాలా అరుదు
ఇటీవలి ఓ కరోనా అధ్యయనంలో తల్లితండ్రులకు ఊరట కలిగించే ఫలితాలు వెల్లడయ్యాయి.
లండన్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి సోకుతున్న కొవిడ్-19 మహమ్మారి తమ చిన్నారికి సోకవచ్చనే ఆలోచనే తల్లితండ్రుల్లో ఒత్తిడి పెంచుతుంది. ఇక నవజాత శిశువుల తల్లితండ్రులు, కాబోయే తల్లితండ్రులు కూడా కరోనా కాలంలో ఆందోళనకు గురవటం సహజం. అయితే ఇటీవలి ఓ అధ్యయనంలో వీరికి ఊరట కలిగించే ఫలితాలు వెల్లడయ్యాయి. నవజాత శిశువులపై కొవిడ్-19 తీవ్ర ప్రభావం చూపదని బ్రిటన్కు చెందిన శాస్త్రవేత్తలు అంటున్నారు. అప్పుడే పుట్టిన చిన్నారులకు కరోనా వైరస్ సోకినప్పటికీ వారిలో 90 శాతం మంది పూర్తిగా కోలుకుంటున్నారని వారు తెలిపారు. కరోనా తీవ్ర ప్రభావం వారిపై చాలా అరుదని తేల్చారు. ఈ అధ్యయన ఫలితాలు లాన్సెట్ జర్నల్లో ప్రచురించారు.
లక్షణాలేంటంటే..
లండన్లోని ఇంపీరియల్ కాలేజ్కు చెందిన శాస్త్రవేత్తలు 29 రోజుల కంటే తక్కువ వయసున్న చిన్నారులపై మార్చి నుంచి ఏప్రిల్ చివరి వరకు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కొవిడ్ సోకిన చిన్నారుల్లో అధిక జ్వరం, పాలు తాగకపోవడం, వాంతులు, జలుబు, దగ్గు, నీరసం వంటి ముఖ్య లక్షణాలుంటాయని వారు తెలిపారు. 1785 మంది నవజాత శిశువుల్లో ఒకరికి మాత్రమే ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్థితి తలెత్తిందని.. ఇది 0.06 శాతమని వివరించారు. ఇక 36 శాతం మందికి కృత్రిమ శ్వాస అందించాల్సి వచ్చిందన్నారు. అయితే వారిలో ఎవరూ చనిపోలేదని అధ్యయనకారులు స్పష్టం చేశారు.
తల్లి నుంచి వేరుగా ఉంచాలా?
కరోనా సోకిన పసివారిలో నాలుగో వంతు నెలలు నిండకుండా పుట్టిన వారే అని పరిశోధకులు తెలిపారు. 66 మందిలో 17 మందికి తల్లి ద్వారా కొవిడ్ నుంచి సోకిందని.. మరో ఆరుగురికి ఆస్పత్రిలో ఉండగా సోకిందని వారు తెలిపారు. తల్లికి కరోనా సోకినా, సోకిందనే అనుమానం ఉన్నా పుట్టిన బిడ్డను వెంటనే తల్లినుంచి వేరుగా ఉంచాలన్నది అంతర్జాతీయ నిబంధనల్లో భాగమని.. అయితే ఆ విధంగా చేసినప్పటికీ 17 మందిలో ఏడుగురికి కొవిడ్ సోకిందన్నారు. ఇక తమ అధ్యయన ఫలితాల ప్రకారం.. కరోనా సోకిన తల్లి నుంచి శిశువును వేరు చేయటం తప్పనిసరి కాదని వారు తెలిపారు. కాగా, గత ఆరు నెలలుగా మాతా శిశు ఆస్పత్రులు, వైద్య కేంద్రాల్లో కరోనా కట్టడి చర్యలు గణనీయంగా అభివృద్ధి చెందాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని