రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు

తుపాను ధాటికి పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమండ్‌ చేస్తూ వరి కంకుల్ని చేతబట్టి సచివాలయం వద్ద నిరసన తెలిపింది తెలుగుదేశం. శాసనసభ సమావేశాలు మొదలైన వేళ ప్రతిపక్షనేత చంద్రబాబు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రైతుల తరపున ఆందోళనలు చేశారు

Published : 30 Nov 2020 18:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తుపాను ధాటికి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం ఆధ్వర్యంలో సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. శాసనసభ సమావేశాలు మొదలైన వేళ ప్రతిపక్షనేత చంద్రబాబు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రైతుల తరపున ఆందోళనలు చేశారు. ముందుగా వెంకటపాలెం బీసీ కాలనీలో ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు, లోకేష్‌ తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాతలకు కలిగిన నష్టాన్ని తెలిపే రీతిలో వర్షాలకు దెబ్బతిన్న వరి కంకులు ప్రదర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యాన పంటలకు రూ.50 వేలు, ముంపు బాధితులకు రూ.10వేల చొప్పున ఇవ్వాలన్నారు. సందర్భంగా తెదేపా నేత అచ్చెన్నాయుడు మాట్లాడారు.

‘‘అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. వస్తూ వస్తూనే అమరావతిని రాజధానిగా రద్దు చేసి రైతులకు తీవ్ర అన్యాయం చేశారు. 350 రోజులుగా ఉద్యమం చేస్తుంటే  కనీస స్పందన కూడా లేదు. ప్రభుత్వం.. రైతులకు ఎంత వ్యతిరేకంగా ఉందో చెప్పటానికి ఇదే ఉదాహరణ. గతంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు పంటలు నష్టపోయిన వారికి ప్రభుత్వం బీమా ఇచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితే లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ కూడా లేదు. ఆరేడు జిల్లాలు అతలాకుతలం అయిపోయాయి. రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చే సమయంలో ముందుగా పసిగట్టి, ప్రజలను చైతన్యపరిచి.. వారి ప్రాణాలను, ఆస్తులను కాపాడాలి. అలా చేసే నాయకుడే ముఖ్యమంత్రి అవ్వాలి. కానీ.. పదిహేడు నెలల నుంచి వరదలు వచ్చినా, సైక్లోన్‌ వచ్చినా రైతులను ఆదుకోవటం లేదు. గతంలో ఉన్న సీఎంను, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రిని ప్రజలు బేరీజు వేసుకోవాలి. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రే స్వయంగా వెళ్లి వివిధ కార్యక్రమాలు చేపట్టిన విషయం గుర్తు చేసుకోవాలి. వరదల వల్ల రైతులకు కలిగిన నష్టంపై చర్చపెట్టాలి. పరిహారం ఇవ్వాలి’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని