సెప్టెంబరు 1 నుంచి తెరుచుకోనున్న తాజ్‌మహల్

ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ పర్యాటకుల సందర్శన కోసం తిరిగి తెరుచుకోనుంది. సెప్టెంబరు 1 నుంచి ఆగ్రాలోని తాజ్‌మహల్, ఆగ్రా కోటను పర్యాటకుల కోసం తెరిచి ఉంచాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు....

Published : 20 Aug 2020 19:09 IST

ఆగ్రా: అద్భుత కట్టడం తాజ్‌మహల్‌ను వీక్షించేందుకు పర్యాటకుల అనుమతి ఇవ్వనున్నారు. సెప్టెంబరు 1 నుంచి ఆగ్రాలోని తాజ్‌మహల్, ఆగ్రా కోటను పర్యాటకుల కోసం తెరిచి ఉంచాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్‌-19 నియంత్రణలో భాగంగా మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. అందులో భాగంగా పురావస్తుశాఖ పరిధిలోని అన్ని పర్యాటక ప్రదేశాలను మూసి ఉంచారు. కొద్ది నెలలుగా విడతల వారీగా కేంద్రం లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జులై నుంచి కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పర్యాటక ప్రదేశాలు కూడా తిరిగి తెరిచేందుకు అనుమతించింది.

దీనిని అనుసరించి తాజాగా ఆగ్రా జిల్లా కలెక్టర్‌ పీఎన్‌ సింగ్ తాజ్‌మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిఖ్రీలను తొలి దశలో భాగంగా సందర్శకుల కోసం తెరిచేందుకు అనుమతులిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే పర్యాటకులు మాత్రం తప్పనిసరిగా మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. కొవిడ్-19 కరోనా కారణంగా పర్యాటక రంగం కూడా తీవ్రంగా నష్టపోయింది. సుమారు ఐదు నెలల తర్వాత ఎంతో ప్రాముఖ్యం కలిగిన పర్యాటక ప్రదేశాలు తిరిగి తెరుచుకోనుండటంతో  ఆ ప్రాంతానికి పర్యాటక శోభ సంతరించుకోవడంతో పాటు ఎంతో మందికి ఉపాధి లభించనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని