బ్లూటూత్‌తో బండి స్టార్ట్‌ చేయొచ్చట!

అనుకోకుండా దొరికిన సమయాన్ని చక్కని ఆవిష్కరణకు పెట్టుబడిగా ఉపయోగించుకున్నాడు 18 ఏళ్ల కుర్రాడు. బ్లూటూత్‌ పరిజ్ఞానాన్ని ద్విచక్ర వాహనానికి జోడిస్తూ కొత్త సౌకర్యాలు అందుబాటులోకి తీసుకుని వచ్చాడు.

Published : 19 Nov 2020 02:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : అనుకోకుండా దొరికిన సమయాన్ని చక్కని ఆవిష్కరణకు పెట్టుబడిగా ఉపయోగించుకున్నాడు 18 ఏళ్ల కుర్రాడు. బ్లూటూత్‌ పరిజ్ఞానాన్ని ద్విచక్ర వాహనానికి జోడిస్తూ కొత్త సౌకర్యాలు అందుబాటులోకి తీసుకుని వచ్చాడు. రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడేలా, ఆకతాయిల నుంచి అమ్మాయిలకు రక్షణ కల్పించేలా సాంకేతికత అభివృద్ధి పరిచాడు  అల్తాఫ్. అతడి సాంకేతికత సంగతులపై మీరు ఓ లుక్కేయండి.

పట్టువదలని విక్రమార్కుడు...
అల్తాఫ్‌ది కృష్ణా జిల్లా తిరువూరు. పాలిటెక్నిక్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. సాంకేతికతను ఉపయోగించి సొంతంగా ఏదైనా చేయాలన్న అభిలాష అతడిది. కరోనా కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని ఆ అభిలాషను నెరవేర్చుకోవటానికి వినియోగించాడు. అందుకోసం ముందుగా సీ, సీ ప్లస్‌, జావా వంటి కోర్సులు నేర్చుకున్నాడు. నూట పదిరోజుల పాటు... నిత్యం పది నుంచి పన్నెండు గంటల పాటు శ్రమించాడు. బ్లూటూత్‌ పరిజ్ఞానంతో వాహనం స్టార్ట్‌ చేసేందుకు అవసరమైన ప్రోగ్రాంను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. సర్య్కూట్‌లో ఆర్‌ఎఫ్ఐడీ, ఆల్కహాల్‌ గుర్తించేందుకు అవసరమైన సెన్సర్లను అమర్చాడు. వాహనం ఉన్న కచ్చితమైన ప్రాంతం తెలుసుకోవటానికి ఓ సిమ్‌కార్డ్‌ను సైతం ఏర్పాటు చేశాడు. ఈ సాంకేతికతను అభివృద్ధి చేయటంలో పదిహేడు సార్లు సరైన ఫలితం రాకపోయినా నిరాశ పడలేదు. మళ్లీమళ్లీ ప్రయత్నించాడు. విఫలమైన ప్రతీసారి సూచనల కోసం పలువురిని సంప్రదించాడు. చాలామంది హేళన చేసినా పట్టించుకోలేదు. తన సంకల్ప బలంతో అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నాడు అల్తాఫ్‌.

రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చు...
‘‘బండిని స్టార్ట్‌ చేయాలంటే హెల్మెట్‌ కచ్చితంగా ధరించాలి. హెల్మెట్‌లో టచ్‌ సెన్సార్‌ ఉంటుంది. ఫోన్‌లోని యాప్‌ సాయంతో బ్లూటూత్‌ ద్వారా వాహనాన్ని స్టార్ట్‌ చేయవచ్చు. ఏదైనా ప్రమాదం జరిగితే కోడ్‌లో ఇచ్చిన ఫోన్‌ నంబర్లకు మెసేజ్‌ వెళ్లిపోతుంది. అందులో లైవ్‌ లొకేషన్‌ వివరాలు కనిపిస్తాయి. దాని ఆధారంగా ప్రమాదం జరిగిన చోటు ఎంతదూరంలో ఉందన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. రోడ్డు ప్రమాదం జరిగినా వ్యక్తులకు ఏం కాకపోతే బండిలో అమర్చిన మరో బటన్‌ నొక్కాలి. దాని ద్వారా అవతలి వారికి సేఫ్‌గానే ఉన్నాం అనే సందేశం వెళ్తుంది. దాంతో వారు కంగారు పడకుండా ఉంటారు. నేను ఉపయోగించిన పరిజ్ఞానం మహిళలకు కూడా ఎంతో ఉపయోగకరం. వారికీ, వారి వాహనానికి ఏమైనా జరిగినా బండికి అమర్చిన బటన్స్‌ నొక్కటం ద్వారా పోలీసులకు సమాచారం వెళ్తుంది. ఈ సాంకేతికత వల్ల ఇతరులెవరూ వాహనాన్నీ చోరీ చేసే అవకాశం ఉండదు. దీనిని అభివృద్ధి చేయటంలో మా కుటుంబ సభ్యులు ఎంతగానో ప్రోత్సాహం అందించారు’’ అని అల్తాఫ్‌ వివరించాడు.



 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని