కరోనా స్పెషల్‌ పానీయాలివి

కరోనా వైరస్‌ మహమ్మారి మనిషి జీవన శైలిని పూర్తిగా మార్చేసింది. ఈ మహమ్మారి ప్రజల ఆరోగ్య అంశాలను ఎంతగానో ప్రభావితం చేసింది.

Published : 02 Aug 2020 00:57 IST

కొవిడ్‌పై పోరాటానికి కొత్త దారులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ మహమ్మారి మనిషి జీవన శైలిని పూర్తిగా మార్చేసింది. ఈ మహమ్మారి ప్రజల ఆరోగ్య అంశాలను ఎంతగానో ప్రభావితం చేసింది. కరోనా ఎఫెక్ట్‌తో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారంపై ప్రజలకు శ్రద్ధ పెరిగింది. కొవిడ్‌-19 అంటేనే హడలి పోతున్న ప్రజలు బయటి తిండి, పానీయాలను ముట్టుకోవటం లేదు. హోటళ్లు, రెస్లారెంట్లతో సహా స్థానిక టీ దుకాణాలకు రావటం కూడా దాదాపు మానేశారు.
తిరిగి ఇంటి ఆహారం, పాత నియమాల వైపు మళ్లుతూ.. రోగ నిరోధక శక్తి పెంచుకోవడం పట్ల దృష్టి సారిస్తున్నారు. అనుకోని విపత్కర పరిస్థితి ఎదురైన పరిస్థితుల్లో పాత తరాల వారు చెప్పే ఆహార నియమాలు, అలవాట్లు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. ప్రకృతి సహజంగా లభించే వస్తువులు రోగనిరోధకతను పెంచుతున్నాయని పూర్వీకులు చెప్పిన మాటను ప్రజలు అమలు చేస్తున్నారు. కాఫీ, టీ తదితర పానీయాలకు బదులు కషాయం వంటి ఆరోగ్యదాయక పానీయాల సేవనం ఉత్తమమని వారు భావిస్తున్నారు.

అయితే, మారుతున్న ప్రజల ఆహార అలవాట్లతో చిరువ్యాపారులకు ఇక్కట్లు ఎదురౌతున్నాయి. సాధారణ రోజుల్లో కిటకిటలాడిన టీ స్టాళ్లు, కాఫీ షాపులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఆ లోటు భర్తీ చేసుకునేందుకు చిరు వ్యాపారులు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు.  ప్రజల అవసరాలకు తగ్గట్టుగా సేవలందిస్తున్నారు. వినియోగదారులకు కషాయం, అల్లం టీ, పసుపు పాలు వంటి పానీయాలు అందిస్తూ గిరాకీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ స్టాళ్లలో బాదం, పసుపు పాలు, కషాయాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. మార్పుకు తగినట్టుగా అల్లం, శొంఠి, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వంటి పదార్ధాలను కషాయం, చాయ్‌లలో కలిపి తమ గిరాకీని పెంచుకుంటున్నారు. ఈ విధమైన పానీయాలను ఇంట్లో తయారు చేసుకునే అవకాశం లేనివారు, ఇతర పనులపై బయటకు వచ్చే వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అల్లం, శొంఠి వంటి ప్రకృతిసిద్ధ పదార్ధాలతో వీరు తయారు చేస్తున్న ‘యాంటీ కరోనా స్పెషల్‌ టీ’కి గిరాకీ పెరిగింది.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని