Telangana News: నల్గొండ జిల్లాలో కూలిన ట్రైనింగ్‌ చాపర్‌.. మహిళా పైలెట్‌ మృతి

నల్గొండ జిల్లాలో శిక్షణ చాపర్‌ కుప్పకూలింది.

Updated : 26 Feb 2022 17:11 IST

పెదవూర: నల్గొండ జిల్లాలో ట్రైనింగ్ చాపర్‌ కుప్పకూలింది. పెదవూర మండలం తుంగతుర్తి సమీపంలో రామన్నగూడెం తండా వద్ద ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మహిళా శిక్షణ పైలెట్‌ మృతి చెందారు. మృతురాలిని తమిళనాడుకు చెందిన మహిమగా గుర్తించామని ఎస్పీ రెమా రాజేశ్వరి  చెప్పారు. సింగల్‌ సీటర్‌ చాపర్‌ ప్రమాదానికి గురైందన్నారు. ఈ చాపర్‌ను నాగార్జున సాగర్‌లోని విజయపురిసౌత్‌ ఏవియేషన్‌ అకాడమీకి చెందినదని ఆమె వెల్లడించారు. విషయం తెలుసుకున్న అకాడమీ అధికారులు, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.  

వ్యవసాయ పొలాల్లో చాపర్‌ కూలినప్పుడు భారీ శబ్దంతో పాటు దట్టమైన పొగలు అలుముకున్నాయి. భయాందోళనకు గురైన స్థానికులు అక్కడికి పరుగులు తీశారు. అప్పటికే ప్రమాదానికి గురైన చాపర్‌ ముక్కలవగా.. పైలెట్‌ మృతదేహం పూర్తిగా ఛిద్రమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు, రెవెన్యూ, వైద్య సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇది సాగర్‌ వైపు నుంచి హైదరాబాద్‌ వైపు వెళుతున్నట్లు కన్పించిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఘటనాస్థలానికి సమీపంలోనే 133కేవీ హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలున్నాయి. చాపర్‌ ఈ తీగలపై కూలి ఉంటే ప్రమాదం మరింత తీవ్ర స్థాయిలో ఉండేదని స్థానికులు చెబుతున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని