
ఫలితాలొచ్చాక..ఓటేయండంటూ ట్వీట్
పోస్టు చేసిన ఎరిక్ ట్రంప్..నెటిజన్ల కామెంట్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తరవాత ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు ఎరిక్ ట్రంప్ చేసిన ట్వీట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఎన్నికలు ముగిసి, ఫలితాలు కూడా వచ్చిన తరవాత.. ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్థిస్తూ పోస్టు చేయడంపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కొన్ని గంటల క్రితం ఎరిక్ ట్రంప్..‘మిన్నెసోటా ప్రజలు బయటకు వచ్చి.. ఓటు వేయండి’ అంటూ ట్వీట్ చేశారు. ఆ వెంటనే తన తప్పును గుర్తించిన ఆయన దాన్ని డిలీట్ చేశారు. కానీ, నెటిజన్లు ఆ పొరపాటును పట్టేశారు. దాంతో వెంటనే అది వైరల్గా మారిపోయింది. రెక్స్ చాప్మ్యాన్ అనే నెటిజన్ ఆ స్క్రీన్ షాట్ను ట్వీట్ చేశారు. ఎన్నికల రోజు చేయాల్సిన ట్వీట్ను తప్పుగా వేరే రోజుకు షెడ్యూల్ చేసుంటారంటూ వ్యాఖ్యను జోడించారు.
కాగా, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికైన జోబైడెన్, కమలాహారిస్లకు అధికార బదిలీ చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ ముందుకు రాలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా.. డెమొక్రటిక్ పార్టీ విజయాన్ని ఆయన అంగీకరించలేకపోతున్నారు.