
మొసలిని విడిచిపెట్టాలా..రూ.50 వేలు ఇవ్వండి
అటవీశాఖ అధికారులను డిమాండ్ చేసిన గ్రామస్థులు
పట్నా: తాము బంధించిన ఓ మొసలిని అప్పగించేందుకు ఉత్తరప్రదేశ్ గ్రామస్థులు రూ.50 వేలు డిమాండ్ చేశారు. ఈమధ్య కాలంలో భారీగా కురిసిన వర్షాలకు ఎక్కడినుంచో వచ్చిన 8 అడుగుల ఓ మొసలి లఖింపుర్ ఖేరీ జిల్లా మిదానియా గ్రామంలోని ఓ కొలనులో ప్రత్యక్షమైంది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు దాన్ని కష్టపడి బంధించి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే ఇక్కడే ఓ తిరకాసు పెట్టారు. ప్రాణాలకు తెగించి మొసలిని కాపాడామని, దాన్ని వారికి అప్పగించాలంటే రూ.50 వేలు ఇవ్వాల్సిందేనని అధికారులను డిమాండ్ చేశారు. స్థానిక పోలీసుల సాయంతో గ్రామస్థులను ఎలాగోలా ఒప్పించిన అటవీశాఖ అధికారులు మొసలిని స్వాధీనం చేసుకొని సమీప ఘాగ్ర నదిలో విడిచిపెట్టారు. ఈసందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. వన్యప్రాణుల సంరక్షణ చట్టంపై అవగాహన లేకపోవడంతోనే గ్రామస్థులు ఇలా చేశారన్నారు. వన్యప్రాణుల చట్టం గురించి ఎక్కువ మందికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Advertisement