కొందరి పైనే కొవిడ్‌ ప్రభావం ఎందుకు ?

కొవిడ్‌ బాధితుల్లో కొంతమంది తీవ్రమైన అనారోగ్యానికి గురి అవుతుంటే, మరికొందరిలో అసలు వైరస్‌ సోకిన లక్షణాలే కనిపించటం లేదు. కొంతమంది మరణిస్తుంటే, మరికొందరు సాధారణ వ్యక్తుల మాదిరిగానే తిరుగుతున్నారు. మరి వైరస్‌ తీవ్రతలో ఇంతటి వైవిధ్యానికి కారణం ఏమిటీ?

Published : 10 Dec 2020 01:31 IST

 

ఇంటర్నె‌ట్‌ డెస్క్‌ : కొవిడ్‌ బాధితుల్లో కొంతమంది తీవ్రమైన అనారోగ్యానికి గురి అవుతుంటే, మరికొందరిలో అసలు వైరస్‌ సోకిన లక్షణాలే కనిపించటం లేదు.  మరి వైరస్‌ తీవ్రతలో ఇంతటి వైవిధ్యానికి కారణం ఏమిటీ? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విషయం గురించి పరిశోధకులు ఏమంటున్నారు? 

కరోనా వైరస్‌ తీవ్రత వెనుక జన్యుపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయట. బెత్ ఇజ్రాయెల్ డీకనెస్‌ మెడికల్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు కొవిడ్‌ తీవ్రతలో హెచ్చుతగ్గులకు జన్యుపరమైన అంశాలకు మధ్యం సంబంధం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ బాధితుల్లో లక్షణాలు భిన్నంగా ఉంటున్నాయి. కొంతమందిలో తేలికపాటి ప్లూ లక్షణాలు కనిపిస్తుంటే మరికొందరిలో అక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ వంటి తీవ్రస్థాయి సమస్యలు కనిపిస్తున్నాయి. గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారిలో కరోనా కారణంగా పరిస్థితులు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు. 

కొవిడ్‌ నేపథ్యంలో చైనా, యూరప్, అమెరికా దేశాల నుంచి గత పదేళ్లుగా సేకరించిన హ్యూమస్‌ జీనోమ్‌ కోడ్‌ను పరిశోధకులు ఇటీవల పరిశీలించారు. 100 టెరాబైట్లు పరిమాణం కలిగిన ఈ జీనోమ్‌ కోడ్‌ను వివిధ ప్రాంతాలతో సంబంధం ఉన్న అన్ని ప్రోటీన్లు, జీవక్రియల సమాహారమైన లైబ్రరీగా పరిశోధకులు పేర్కొంటున్నారు. కొవిడ్ వ్యాధితో సంబంధం ఉన్న ఒక జన్యు సంబంధమైన హాట్‌స్పాట్‌ను పరిశోధకులు పరిశీలించినపుడు, అది ఒక ప్రోటీన్‌తో ముడిపడి ఉందని గుర్తించారు. ఈ ప్రోటీన్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొవిడ్‌ ఎక్కువగా ప్రబలుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే కరోనా ఇన్ఫెక్షన్‌ను ఈ ప్రోటీన్ ఎలా ప్రభావితం చేస్తోందన్నది స్పష్టంగా తెలియటం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏదేమైనా తాజా పరిశోధన కొవిడ్‌ చికిత్సల్లో జన్యు పరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుందని పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు. పరిశోధన వివరాలు న్యూ ఇంగ్లండ్‌ జర్నల్ ఆఫ్‌ మెడిసిన్‌లో ఇటీవలే ప్రచురితం అయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని