Hyderabad: 2 వేల పడకలతో నిమ్స్‌లో నూతన భవనం.. త్వరలో భూమిపూజ: హరీశ్‌రావు

నిమ్స్‌ ఆసుపత్రి విస్తరణలో భాగంగా నిర్మించబోతున్న 2వేల పడకల నూతన భవనానికి త్వరలో సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేస్తారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.

Updated : 02 May 2023 21:34 IST

హైదరాబాద్‌: నిమ్స్‌ ఆసుపత్రి విస్తరణలో భాగంగా నిర్మించబోతున్న 2వేల పడకల నూతన భవనానికి త్వరలో సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేస్తారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన భవనంలో ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలకు ప్రత్యేకంగా బ్లాకులు ఉంటాయన్నారు. భవనం మొత్తం ఎనిమిది అంతస్థులుగా ఉంటుందని చెప్పారు.

ప్రస్తుతం నిమ్స్‌లో 1500 పడకలు ఉన్నాయని, నూతన భవనం పూర్తయితే పడకల సంఖ్య 3,500కు చేరుతుందన్నారు. ఇటీవల భూమిపూజ చేసుకున్న సూపర్‌ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ కూడా పూర్తయితే మరో 200 పడకలు అదనంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. నిమ్స్‌ ఎంసీహెచ్‌ పనులు వేగవంతం చేయాలన్నారు. పెరుగుతున్న జనాభా, అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌ నలువైపులా ఒక్కొక్కటి వెయ్యి పడకలు కలిగి ఉండే టిమ్స్‌ దవాఖానలతో పాటు నిమ్స్‌ విస్తరణకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు.

దేశంలోనే తొలి సూపర్‌ స్పెషాలిటీ ఎంసీహెచ్‌

గాంధీ దవాఖానలో నిర్మిస్తున్న 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇది ప్రారంభిస్తే దేశంలోనే తొలి సూపర్‌ స్పెషాలిటీ ఎంసీహెచ్‌గా రికార్డు సృష్టిస్తామని చెప్పారు. గాంధీలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రం, స్టేట్‌ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌ పనులను వేగవంతం చేయాలన్నారు. నిమ్స్‌లో మాదిరిగా గాంధీలోనూ అవయవ మార్పిడి సర్జరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను మంత్రి ఆదేశించారు. బ్రెయిన్‌ డెడ్‌ డిక్లరేషన్లు జరిపి, అవసరమైన వారికి అవయవాలు అందించి పునర్జన్మ ప్రసాదించాలన్నారు. ఎంఎన్‌జే దవాఖానలో నూతనంగా ప్రారంభించిన ఆంకాలజీ బ్లాక్‌లో వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందాలన్నారు. శానిటేషన్‌, సెక్యూరిటీ, పేషెంట్‌ కేర్‌ విభాగాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్‌ చేస్తూ ఉండాలన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని