AB Venkateswara Rao: కొంత మంది వ్యక్తులు.. కొన్ని శక్తులు నన్ను టార్గెట్‌ చేస్తున్నాయి: ఏబీవీ

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. నిఘా విభాగం చీఫ్‌గా పని చేసిన సమయంలో భద్రత పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై ఏసీబీ...

Updated : 29 Jun 2022 15:41 IST

విజయవాడ: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. నిఘా విభాగం చీఫ్‌గా పని చేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయన సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు యత్నించారన్న అభియోగాలపై తాజాగా మరోసారి సస్పెండ్‌ చేసింది. దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు.

విజయవాడలో ఏబీవీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఒకే అంశంపై ఎవరైనా ఒకరిపై రెండు సార్లు చర్యలు తీసుకుంటారా? లీగల్‌గా ఇవేవీ చెల్లవు. న్యాయసమీక్షకు నిలబడే నిర్ణయాలు కావు ఇవి. నాపై ఇంతవరకూ ఏ ఛార్జిషీట్‌ లేదు. రాజకీయ నాయకులకు ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ నిబంధనలు వర్తించవు అనుకుందాం. ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మిపై కేసులున్నాయి... ఛార్జిషీట్లూ ఉన్నాయి.. ఆమెకు వర్తించని నిబంధనలు నాకెలా వర్తిస్తాయి?ఆర్టికల్‌ 14 కింద ఉన్న సమానత్వం అనే ప్రాథమిక హక్కుకు భంగం కలిగించినట్లే అవుతుంది. ఇవన్నీ పట్టుకొని మరోసారి కోర్టుకు వెళ్లి పోరాడాల్సిందే..

అవినీతి జరగని చోట ఏసీబీ కేసేంటి?

ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ప్రతి అక్షరం, ప్రతి వాక్యం అబద్ధం. అవి అబద్ధాలు అని నిరూపించేందుకు నా దగ్గర కట్టల కొద్ది ఆధారాలున్నాయి. అవన్నీ పబ్లిక్‌ డొమైన్‌లోనే ఉన్నాయి. ఒక రూపాయి కూడా అవినీతి జరగని చోట ఏసీబీ కేసు పెట్టడం ఏంటి? ఇజ్రాయెల్‌ కంపెనీ అని పదేపదే అంటున్నారు. అదేమైనా సూట్‌కేసు సంస్థా? ఈ విషయంలో ఎక్కడ కూడా మేం ఎవరికీ ఒక రూపాయి కూడా కమీషన్‌ ఇవ్వలేదని సంస్థ స్పష్టంగా చెబుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇంత క్లియర్‌గా చెప్పిన తర్వాత కూడా ఏసీబీ కేసు పెట్టడం ఏంటి? అవినీతి జరిగినట్లు ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేవు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. మంచి పనులు చేసేందుకు ఎలాంటి పరిమితులు ఉండవు. నిబంధనలు అతిక్రమించి చెడ్డ పనులు చేస్తే ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూస్తే అడ్డుకున్నా..

ఇప్పుడు నన్ను ప్రభుత్వం టార్గెట్‌ చేయడం లేదు. కొంత మంది వ్యక్తులు, కొన్ని శక్తులు టార్గెట్‌ చేస్తున్నాయి. అందుకు కారణాలు చాలా ఉన్నాయి. నేను ఐబీ చీఫ్‌గా పనిచేసినప్పుడు రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూస్తే అడ్డుకున్నాను. కోడి కత్తి కేసు ఘటనను అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూశారు. కొన్ని గంటల్లోనే దాన్ని సమర్థంగా ఎదుర్కొని నిలువరించాం. కొంత మందికి అందుకే నాపై కోపం అనుకుంటాను. చెడ్డ పనులను జరగకుండా ఆపడమే నా తప్పా? నాపై ఎన్నో ఫిర్యాదులు, పిటిషన్లు.. మూడేళ్లలో నేను తప్పు చేసినట్లు ఎక్కడా ఒక్క ఆధారం కూడా లేదు. నన్ను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారో చెప్పేందుకు ఈ కారణాలు చాలవా? విచారణ సమయంలో నాపై నకిలీ పత్రాలు పెట్టారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాను. మూడేళ్లైనా ఇంతవరకు నేను చేసిన తప్పేంటో చెప్పలేకపోయారు. ప్రభుత్వ తీరుపై న్యాయపోరాటం తప్పదు.. ఇంకా పోరాడతా’’ అని ఏబీవీ వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని