Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీకోసం..

Updated : 11 Jan 2022 17:29 IST

1. Raghurama: బెయిల్‌పై సుప్రీంలో వాదనలు

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. జ‌స్టిస్ వినీత్ శ‌ర‌న్‌ నేతృత్వంలోని వెకేష‌న్ బెంచ్ దీనిపై విచార‌ణ చేపట్టింది.  రఘురామ తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, ఆదినారాయణ.. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు దుష్యంత్‌ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Sputnik-V: ప్రారంభమైన వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌

కొవిడ్‌పై పోరుకు కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌తో పాటు భారత్‌లో అత్యవసర వినియోగానికి అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్‌- వి.. వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ప్రారంభ‌మైంది. దీనికి సంబంధించిన సాఫ్ట్ లాంచ్‌ను అపోలో హాస్పిటల్స్ ఈ ఉద‌యం ఆవిష్క‌రించింది. డా. రెడ్డీస్ సిబ్బంది అశోక్‌కు స్పుత్నిక్ మొదటి డోసు వేసి వాక్సినేషన్ డ్రైవ్‌ను మొద‌లుపెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. DRDO: 2DG ఔషధం విడుదల

కొవిడ్‌ బాధితులకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. కరోనా చికిత్సలో ఉపయోగించడం కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన ‘2డీజీ(2-డియాక్సీ డి-గ్లూకోజ్‌)’ ఔషధం విడుదలైంది. దిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తొలి బ్యాచ్‌ 2డీజీ సాచెట్లను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు అందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. Corona: 3 లక్షల దిగువకు కొత్త కేసులు

దేశంలో కరోనా సృష్టిస్తోన్న విలయం భారీ సంఖ్యలో ప్రాణాలను హరిస్తోంది. తాజాగా నమోదవుతున్న కేసులు రోజురోజుకు తగ్గుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య భారీగానే ఉంటోంది. గడిచిన 24 గంటల్లో  నాలుగు వేలమందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది. ఇక వరుసగా నాలుగో రోజు కొత్త కేసులు తగ్గాయి. 3 లక్షల దిగువన నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. Cyclone Tauktae: అతిభీకర తుపానుగా తౌక్టే

ముంబయి: దేశ పశ్చిమ తీర రాష్ట్రాలను ‘తౌక్టే’ తుపాను గజగజ వణికిస్తోంది. ఇప్పటికే కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన ఈ తుపాను ఇప్పుడు మరింత బలపడి ‘అతి భీకర తుపాను’గా మారినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం గుజరాత్‌ వైపు పయనిస్తున్న తౌక్టే.. మంగళవారం ఉదయం నాటికి భావనగర్‌ జిల్లాలోని పోర్‌బందర్‌-మహువా ప్రాంతం వద్ద తీరాన్ని తాకే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో గుజరాత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. Naradha Scam: సీబీఐ అదుపులో మంత్రులు

పశ్చిమబెంగాల్‌లో సంచలనం సృష్టించిన నారదా స్టింగ్‌ ఆపరేషన్‌ కేసులో ఇద్దరు మంత్రులు ఫిర్హాద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీలను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోమవారం అదుపులోకి తీసుకుంది. వీరితో పాటు ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, కోల్‌కతా మాజీ మేయర్‌ సోవన్‌ ఛటర్జీలోని కూడా సీబీఐ కార్యాలయానికి తరలించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* Narada Scam: సీబీఐ కార్యాలయం వద్ద మమత

7. Ganga River:మృతదేహాలు గంగపాలు కాకుండా చూడండి

గంగ.. దాని ఉపనదుల్లో మృతదేహాలు పడేయకుండా నిఘా పెట్టాలని ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాలను ఆదివారం కేంద్రం ఆదేశించింది. నదుల్లో కొట్టుకువస్తున్న శవాలు కనిపిస్తే వాటికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాలని సూచించింది. ఇందులో ఎలాంటి ఆలస్యం చేయకుండా, తమ ఆదేశాలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ విషయమై వరుసగా శని, ఆదివారాల్లో కేంద్ర ప్రభుత్వం సమీక్షలు జరిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. వచ్చే ఏడాది శీతాకాల సమావేశాలు

పార్లమెంటు నూతన భవనం నిర్మాణం, సెంట్రల్‌ విస్టా పనులను పక్కనపెట్టాలని కాంగ్రెస్‌ సహా విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం అడుగు ముందుకు వేసేందుకే మొగ్గు చూపిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టుల పనుల్ని వేగవంతం చేసి, 2022 డిసెంబరులో శీతాకాల సమావేశాలను కొత్త భవనంలోనే నిర్వహించాలని భావిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. NEFT సేవలు.. ఆ రోజున పనిచేయవు

ఆన్‌లైన్‌ లావాదేవీలకు జరిపే నెఫ్ట్‌(నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌) సేవల్లో అంతరాయం ఏర్పడనుంది. వచ్చే ఆదివారం 14 గంటల పాటు ఈ సేవలు పనిచేయవని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) నేడు ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఈ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. Bill Gates అందుకే వైదొలిగారా?

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ 2020లో సంస్థ బోర్డు నుంచి వైదొలిగారు. తన భార్య మెలిందాతో కలిసి ఏర్పాటు చేసిన ‘బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్ ఫౌండేషన్‌’ నిర్వహించే ధార్మిక కార్యక్రమాలపై మరింత దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని బిల్‌ అప్పట్లో ప్రకటించారు. అయితే, అది నిజం కాదని పలు అంతర్జాతీయ పత్రికలు తాజాగా పేర్కొన్నాయి. సంస్థలోని ఓ మహిళా ఉద్యోగితో కొన్నేళ్ల క్రితం బిల్‌ గేట్స్‌  లైంగిక సంబంధాలు కొనసాగించారని.. దీనిపై బోర్డు ఓ బయటి న్యాయ సంస్థతో విచారణ చేయించిందని కథనాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని