Top Ten News @ 1 PM
ఈనాడు.నెట్లోని ముఖ్యమైన పది వార్తలు మీకోసం..
1. Cyclone Yaas:తీరాన్ని తాకిన యస్
బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుపాను యస్ బుధవారం ఉదయం తీరాన్ని తాకింది. ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని ధామ్రా ఓడరేవు సమీపంలో తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైందని వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. తుపాను పరిమాణం భారీగా ఉండటంతో.. తీరాన్ని దాటే ప్రక్రియ ముగియడానికి కొన్ని గంటలు పట్టనుందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* Cyclone Yaas: ఉత్తరాంధ్రలో 60కి.మీ వేగంతో గాలులు!
2. Raghurama: ఎంపీ రఘురామ డిశ్చార్జ్
సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారే ఆరోపణలపై ఏపీ సీఐడీ రఘురామపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి గుంటూరు తరలించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన్ను సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. Krishnapatnam: ఆనందయ్య శిష్యబృందంతో చెవిరెడ్డి భేటీ
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య శిష్య బృందంతో తితిదే పాలక మండలి సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి భేటీ అయ్యారు. తిరుపతిలోని తుడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆనందయ్య మనవడు వంశీకృష్ణ, మేనల్లుడు బాలసుబ్రహ్మణ్యంతో చెవిరెడ్డి మాట్లాడారు. ఆనందయ్య మందుకు ఆయుష్ అనుమతి వస్తే ఔషధం తయారు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. Corona: 2.08లక్షల కేసులు.. 2.95లక్షల రికవరీలు
దేశంలో గత 24 గంటల వ్యవధిలో 22,17,320 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2,08,921 కొత్త కేసులు వెలుగుచూశాయి. సుమారు 40 రోజుల తరవాత రెండు లక్షల దిగువకు చేరిన కేసులు..తాజాగా మరోసారి ఆ మార్కును దాటాయి. రోజూవారీ మరణాల్లో పెరుగుదల కనిపించింది. 4,157 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటివరకు 2,71,57,795 మందికి కరోనా సోకగా..3,11,388 మంది ప్రాణాలు వదిలారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. Corona: 2 నెలల్లో 577 మంది అనాథలయ్యారు..!
కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేస్తోంది. చిన్నారులను అనాథలుగా మారుస్తోంది. వృద్ధులకు అండ లేకుండా చేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి మే 25 మధ్యాహ్నం 2 గంటల సమయానికి దేశవ్యాప్తంగా కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 577 మంది పిల్లలను గుర్తించినట్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. Vaccine: టీకా వృథా.. అత్యధికంగా ఆ రాష్ట్రంలో
ఓ వైపు వ్యాక్సిన్ల కొరత కారణంగా చాలా చోట్ల పంపిణీ నిలిచిపోతుండగా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం టీకా వృథా విపరీతంగా ఉంటుండంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ వృథాను ఒక శాతం కంటే తక్కువే ఉంచాలని కేంద్రం పదేపదే కోరుతున్నా.. ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల్లో దాదాపు మూడోవంతు డోసులు నిరుపయోగమవుతున్నాయని పేర్కొంది. అత్యధికంగా ఝార్ఖండ్లో 37.3శాతం టీకాలు వృథా అవగా.. ఛత్తీస్గఢ్లో ఇది 30.2శాతంగా ఉండటం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. Chiranjeevi: మాట నిలబెట్టుకున్న మెగాస్టార్
‘బ్లడ్బ్యాంక్’, ‘ఐబ్యాంక్’ వేదికలుగా ఇంతకాలం ఎంతోమందికి సాయం అందించిన మెగాస్టార్ చిరంజీవి మరోసారి మాట నిలబెట్టుకున్నారు. కరోనా బారినపడి సమయానికి ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న వారి కోసం చెప్పినట్టుగానే ‘చిరు ఆక్సిజన్ బ్యాంక్’లను ఆయన అందుబాటులోకి తీసుకువచ్చారు. బుధవారం ఉదయం అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ‘చిరు ఆక్సిజన్ బ్యాంక్’ సేవలు ప్రారంభమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. WhatsApp: కొత్త ఐటీ నిబంధనలపై హైకోర్టుకు
సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ కంటెంట్పై నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం బుధవారం నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ నియమ నిబంధనలపై ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలను తక్షణమే నిలిపివేయాలని కోరిన వాట్సాప్.. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో ఫిర్యాదు చేసినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. Lakshadweep: లక్షద్వీప్లో కొత్త అలజడి
భారత కేంద్రపాలిత ప్రాంతమైన ‘లక్ష ద్వీప్’లో రాజకీయ కార్యకలాపాలు చాలా తక్కువ. ప్రముఖ పర్యాటక ప్రాంతంగానే దీనికి ప్రశస్తి ఉంది. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ‘సేవ్ లక్ష ద్వీప్’ అంటూ ఏకంగా ఉద్యమమే సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తమ ‘జీవితాలు, జీవనోపాధి, సంస్కృతి’కి నష్టం కలిగిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ‘లక్షదీప్కు కొత్త రూపం’ పేరుతో ఈ ప్రాంతం అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ కె పటేల్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలే దీనికంతటికీ కారణం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. INDvsNZ: టీమ్ఇండియా ఇన్నింగ్స్ విన్నింగ్స్..!
దాదాపు రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచిన టీమ్ఇండియా, న్యూజిలాండ్ జట్లు ఆ రసవత్తర పోరులో తలపడటానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచ కప్కు ఏ మాత్రం తీసిపోని ఈ మెగా మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే విషయంపై ఇప్పటికే పలు రకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఇరు జట్ల మధ్యా ఇప్పటివరకు జరిగిన టెస్టుల్లో టీమ్ఇండియా మూడుసార్లు ఆ జట్టుపై ఇన్నింగ్స్ తేడాతో గెలుపొందింది. అవి ఎప్పుడు జరిగాయో.. ఎవరు గెలిపించారో తెలుసుకోవాలంటే.. ప్రత్యేక కథనం కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.