Amaravati: రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు

రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసు విచారణ త్వరగా చేపట్టాలన్న ఏపీ ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తిని సుప్రీం దర్మాసనం తోసిపుచ్చింది.

Updated : 28 Mar 2023 17:59 IST

దిల్లీ: రాజధాని అమరావతి(Amaravati)కి సంబంధించిన కేసుల అంశంలో ఏపీ ప్రభుత్వానికి (AP Govt) సుప్రీంకోర్టు(Supreme Court)లో మరోసారి చుక్కెదురైంది. కేసు విచారణ త్వరగా చేపట్టాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది. జులై 11న తొలి కేసుగా విచారణకు తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు మరోసారి కోరగా.. స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. పిటిషన్ దాఖలు చేసిన వారిలో కొంత మంది రైతులు చనిపోయారని ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. మరణించిన వారి తరఫున ప్రతినిధులు ప్రతివాదులుగా ఉండేందుకు అనుమతివ్వాలని న్యాయవాదులు కోరగా అందుకు అనుమతించిన ధర్మాసనం .. వారికి నోటీసులు పంపాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులను ఆదేశించింది.

రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్‌ను వెంటనే విచారించాలన్న ఏపీ ప్రభుత్వ న్యాయవాదులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జోసెఫ్‌ అసహనం వ్యక్తం చేశారు. ఒక కేసు విచారణ పూర్తి కాకుండా.. మరో కేసు ఎలా విచారిస్తామని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం అలా విచారించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. బాంబే మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసు సగంలో ఉండగా.. భోజన విరామ సమయం వచ్చింది. దాని తర్వాత తిరిగి బెంచ్‌ కూర్చొనేటప్పుడు వేరే అంశాలు, కేసులకు సంబంధించి మెన్షనింగ్స్‌ జరిగాయి. ముంబయి కేసు విచారణ తిరిగి ప్రారంభించే ముందు ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు అమరావతి పిటిషన్‌ తీసుకోవాలని కోరగా.. జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. కేసు విచారణ జరుగుతోంది.. ఆ కేసు విచారణ సగంలో ఉంది. అది కాదని పక్కనబెట్టి మీ కేసు ఎలా తీసుకోవాలని ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని