AP News: అమరావతి రైతులకు చీరాల డీఎస్పీ హెచ్చరిక.. పర్చూరులో ఉద్రిక్తత 

ప్రకాశం జిల్లాలోకి అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రవేశించిన తొలిరోజే పోలీసులు ఆంక్షల అస్త్రం బయటకు తీశారు. పాదయాత్రలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ

Updated : 06 Nov 2021 21:10 IST

చీరాల: ప్రకాశం జిల్లాలోకి అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రవేశించిన తొలిరోజే పోలీసులు ఆంక్షల అస్త్రం బయటకు తీశారు. పాదయాత్రలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పర్చూరు జంక్షన్‌లో చీరాల డీఎస్పీ నోటీసులు ఇచ్చారు. యాత్రకు అనుమతి ఇచ్చినప్పుడు హైకోర్టు, డీజీపీ విధించిన షరతులను రైతులు ఉల్లంఘించినట్టు పేర్కొన్నారు. ఆరో రోజు పాదయాత్ర ముగిసిన తర్వాత రైతులు బస చేసిన కల్యాణ మండపం వద్దకు చేరుకున్న డీఎస్పీ.. అమరావతి ఐకాస నేతలు శివారెడ్డి, తిరుపతిరావు, సుధాకర్‌, పలువురు ప్రజాప్రతినిధులకు నోటీసులు అందజేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని పోలీసులు ఆదేశించారు. అనుమతించిన వారి కంటే ఎక్కువ మంది పాదయాత్రలో పాల్గొన్నారని, అనుమతి లేకుండా మైక్‌లు ఉపయోగించారని, కొవిడ్‌ నిబంధనలు పాటించలేదని  నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసులు ఇచ్చిన నోటీసులకు వారం రోజుల్లోగా వివరణ ఇస్తామని రైతు ఐకాస నేతలు తెలిపారు.

పాదయాత్ర పర్చూరుకు చేరిన సమయంలో ఉద్రిక్తత ఏర్పడింది. పర్చూరు వై.జంక్షన్‌ వద్ద మహాపాదయాత్ర వాహనాలను ఓ వ్యక్తి ఫొటోలు తీయడం ఉద్రిక్త పరిస్థితికి కారణమైంది. ఫొటోలు ఎందుకు తీస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫొటోలు తీసిన వ్యక్తితో అమరావతి రైతులు వాగ్వాదానికి దిగారు. వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు ఫొటోలు తీసిన వ్యక్తి కానిస్టేబుల్‌ అని రైతులకు సర్ది చెప్పారు. సదరు వ్యక్తిని పోలీసు జీపులో ఎక్కించి అక్కడి నుంచి పంపించి వేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు