Amitabh Bachchan: పాన్ మసాలా బ్రాండ్‌ యాడ్‌ నుంచి తప్పుకొన్న బిగ్‌ బీ

ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (79) పాన్‌ మసాలా బ్రాండ్‌ యాడ్‌ నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు

Updated : 11 Oct 2021 17:57 IST

ముంబయి: ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌  పాన్‌ మసాలా బ్రాండ్‌ యాడ్‌ నుంచి తప్పుకొన్నట్లు వెల్లడించారు. యాడ్‌ చేయడానికి తీసుకున్న మొత్తం సొమ్మును కూడా తిరిగి ఇచ్చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగులో పేర్కొన్నారు. పాన్‌ మసాలా బ్రాండ్‌ ప్రమోషన్లతో తనకు ఇక ఎలాంటి  సంబంధం లేదన్నారు. పాన్ మ‌సాలా బ్రాండ్ ప్రమోషన్‌ స‌రోగేట్ అడ్వర్టైజింగ్‌(నిషేధిత వస్తువుల ప్రచారం) కింద‌కు వ‌స్తుంద‌నే విషయం తనకు తెలియ‌ద‌న్నారు. ఆ విషయం గురించి తెలుసుకున్నాక ఆ యాడ్‌ నుంచి వైదొలిగినట్లు వివరించారు.

పాన్‌ మసాలా యాడ్‌ల నుంచి తప్పుకోవాలని జాతీయ పొగాకు నిర్మూలన సంస్థ (NOTE) గత నెలలోనే అమితాబ్‌ బచ్చన్‌కు లేఖ రాసింది. సమాజంలో ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తి ఇటువంటి ప్రకటనలు చేయరాదని.. వెంటనే సదరు కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని సూచించింది. పాన్ మసాలా వాడటం వల్ల క్యాన్సర్‌ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని.. ఇటువంటి ప్రకటనల నుంచి బిగ్‌ బీ వైదొలగి పొగాకు వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని జాతీయ పొగాకు నిర్మూలన సంస్థ అధ్యక్షుడు డాక్టర్ శేఖర్ సల్కర్ కోరారు. ఈ నేపథ్యంలో అమితాబ్‌ బచ్చన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాన్‌ మసాలా యాడ్‌లో నటించినందుకు అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేయడంతో బిగ్‌ బీ ఈ ప్రకటన నుంచి వైదొలిగారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని