పేదవాడి కడుపు నింపడం మా సంస్కృతి: మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు, ఆసుపత్రులకు, బ్యాంకులకు వచ్చే పేదలు ఆకలితో తిరిగి ఇళ్లకు వెళ్లకూడదని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అదృష్టంగా భావిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య అన్నారు.

Updated : 29 Dec 2022 00:03 IST

నందిగామలో 141వ రోజు అన్న క్యాంటీన్‌

నందిగామ: పేదవాడి కడుపు కొట్టడం మీ విష సంస్కృతి, ఆకలిగొన్నవాడికి అన్నం పెట్టడం మా అదృష్టం అని తెదేపా నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. దొడ్డపునేని రాధాకృష్ణ మూర్తి 20వ వర్ధంతి సందర్భంగా నందిగామ పట్టణంలో ఆయన కుమారులు, కుమార్తె, 14వ వార్డు కౌన్సిలర్‌ కామసాని సత్యవతి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడారు. నందిగామ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు, ఆసుపత్రులకు, బ్యాంకులకు వచ్చే పేదలు ఆకలితో తిరిగి ఇళ్లకు వెళ్లకూడదని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమె అన్నారు. నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్‌ వద్ద ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు ఎదురైనా ఎన్టీఆర్‌ అన్న క్యాంటీన్‌ ద్వారా అన్నదానం చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్‌కు సహకరిస్తున్న దాతలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అలాగే తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పేరిట జనవరి 27 నుంచి 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర చేపట్టనున్న మహాపాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 



 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని