పుల్లూరు వద్ద నిలిచిపోయిన 20 అంబులెన్స్‌లు..

ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు మళ్లీ నిలిపేస్తున్నారు.

Updated : 14 May 2021 19:20 IST

పుల్లూరు: ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు మళ్లీ నిలిపేస్తున్నారు. దీంతో కర్నూలు జిల్లా సరిహద్దులోని పుల్లూరు చెక్‌పోస్టు వద్ద అర్ధరాత్రి తర్వాత నుంచి పెద్ద ఎత్తున అంబులెన్స్‌లు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల నుంచి బెడ్‌ అనుమతి పత్రం, తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన ఈ-పాస్‌ ఉంటేనే అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో సుమారు 20 అంబులెన్స్‌లు పుల్లూరు చెక్‌పోస్టు వద్ద నిలిచిపోయాయి. మరోవైపు సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్‌ రోడ్డు వద్ద కూడా ఏపీ అంబులెన్స్‌లను నిలిపేస్తున్నారు. రోగులతో వస్తున్న అంబులెన్స్‌లను అడ్డుకోవడంతో వారి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులున్నా ఆపేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

మరోవైపు అంబులెన్స్‌లు ఆపేసిన విషయం తెలుసుకున్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ పుల్లూరు చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఈ-పాస్‌, బెడ్లు ఖాళీగా ఉన్నట్లు అనుమతులు ఉంటేనే విడిచిపెడుతున్నామని ఎమ్మెల్యేకు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. దీంతో అన్ని అనుమతులు ఉన్నాకే హైదరాబాద్‌ బయల్దేరాలని రోగుల బంధువులకు ఎమ్మెల్యే సూచించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నవారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి ఎమ్మెల్యే పంపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని