
AP News: పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు: మంత్రిసురేశ్
గుంటూరు: నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఉన్నత విద్యలో కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తు కోసం ఆన్లైన్ విధానం తప్పనిసరి అని ఆయన తెలిపారు. ఆన్లైన్ కోర్సులకు రానున్న కాలంలో మరింత డిమాండ్ ఉంటుందని వివరించారు. గుంటూరు వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్తో కలిసి మంత్రి సురేశ్ ఇవాళ ఆన్లైన్ విద్యాభ్యాసం ప్రారంభించారు
ఈ సందర్భంగా పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగుల నిరసనలు, కొవిడ్ నేపథ్యంలో పాఠశాలల నిర్వహణపై మంత్రి స్పందించారు. ‘‘సీఎంతో సమావేశంలో ఉద్యోగులు పీఆర్సీకి అంగీకరించారు. మళ్లీ ఇప్పుడు ఆందోళన చేయడం సరికాదు. ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చు.
కొవిడ్ కేసులు పెరుగుతున్నా తీవ్రత లేదు. పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు. పిల్లలకు కొవిడ్ సోకితే ఆ పాఠశాల మూసివేసి తర్వాత ప్రారంభిస్తాం. కొన్ని యూనివర్సీటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయి. కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చింది’’ అని మంత్రి సురేశ్ అన్నారు.