Andhra News: సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ తెస్తామని సీఎం హామీ ఇచ్చారు: వెంకట్రామిరెడ్డి

సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ తెస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 

Updated : 09 Jun 2023 15:13 IST

తాడేపల్లి: ఏపీ ఎన్జీవో నేతలు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డిని శుక్రవారం కలిశారు. ఉద్యోగ సంఘాల నేతల్లో ఏపీ ఉద్యోగ ఐకాస అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, శివారెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, తదితరులు ఉన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్‌ లేని ఫించను ఇవ్వాలని సీఎంను కోరామని వెల్లడించారు. దీనిపై సీఎం స్పందిస్తూ కాంట్రిబ్యూషన్‌ లేని విధానం భారమవుతుందన్నారని చెప్పారన్నారు.

ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరణకు మంత్రులు, సీఎస్‌ కృషి చేశారని ఏపీ ఉద్యోగ ఐకాస అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కొనియాడారు. కేబినెట్‌లో 12వ పీఆర్సీ ప్రకటన, ఉద్యోగుల బకాయిలను 36 విడతల్లో ఇచ్చేలా చర్యలు, అన్ని జిల్లాల్లో ఒకే హెచ్‌ఆర్‌ఏ ఇచ్చినందుకు సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం ఉద్యోగులకు కల్పిస్తున్న సదుపాయాలను స్వాగతిస్తున్నామని బండి శ్రీనివాస్‌ తెలిపారు. జీపీఎస్‌లో ఉద్యోగికి నష్టం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని సీఎం తెలిపారన్నారు.

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ తెస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ఓపీఎస్‌తో సమానంగా లబ్ధి కలిగించేలా జీపీఎస్‌ను తీసుకొచ్చారన్నారు. ‘‘జీపీఎస్‌తో నష్టం ఉండదని, ఉద్యోగులకు మేలు జరుగుతుందని సీఎం చెప్పారు. జీపీఎస్‌.. దేశానికి రోల్‌ మోడల్‌గా ఉంటుందన్నారు. ఉద్యోగులు రిటైర్‌ అయ్యాక భద్రత కల్పించేలా జీపీఎస్‌ తెచ్చామని చెప్పారు. జీపీఎస్‌ తీసుకువచ్చిన సీఎంకు ధన్యావాదాలు తెలిపాం’’ అని వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని