AP Govt: సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై ఏపీ ప్రభుత్వం భారీ జరిమానాలు

ఒకసారి వాడి పారేసే (సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై భారీగా జరిమానాలు విధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ నిబంధనల్లో సవరణలు తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Updated : 01 Dec 2022 14:54 IST

అమరావతి: ఒకసారి వాడి పారేసే (సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై భారీగా జరిమానాలు విధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ నిబంధనల్లో సవరణలు తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యాన్ని సృష్టించేవారే వ్యయాన్ని భరించాలన్న సూత్రం ఆధారంగా జరిమానాలు విధించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు వేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాలిథిన్‌ క్యారీ బ్యాగుల ఉత్పత్తి, విక్రయాలు.. ఈ కామర్స్‌ కంపెనీలపైనా దృష్టి పెట్టాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్‌ వినియోగంపై పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది దృష్టి సారించాలని స్పష్టం చేసింది. 

వీధివ్యాపారులకు రూ.5వేల వరకు..

నిషేధించిన ప్లాస్టిక్‌ ఉత్పత్తుల దిగుమతి, తయారీపై తొలిసారి తప్పుగా పరిగణిస్తే రూ.50వేలు, రెండోసారి రూ.లక్ష జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ ఉత్పత్తులను స్టాక్‌ చేసినా, పంపిణీ చేసినా డిస్ట్రిబ్యూటర్‌ స్థాయిలో రూ.25వేల నుంచి రూ.50వేల వరకు జరిమానా విధిస్తారు. దీంతోపాటు సీజ్‌ చేసిన ఉత్పత్తులపై కేజీకి రూ.10చొప్పున పెనాల్టీ వేయనున్నారు. వీధి వ్యాపారులు ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్‌లను వినియోగిస్తే రూ.2500 నుంచి రూ.5వేల వరకు జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. దుకాణాలు, సంస్థలు, మాల్స్‌ తదితర ప్రదేశాల్లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తులు విక్రయిస్తే రూ.20వేల నుంచి రూ.40వేల వరకు జరిమానా విధించనున్నారు. ఈ మేరకు అటవీ పర్యావరణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని