AP High Court: ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. జీవో నంబర్‌ 1 కొట్టేసిన హైకోర్టు

ఏపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రోడ్డుషోలు, బహిరంగ సభలను కట్టడి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను హైకోర్టు కొట్టేసింది.

Updated : 12 May 2023 15:36 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రోడ్డుషోలు, బహిరంగ సభలను కట్టడి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను హైకోర్టు కొట్టేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు వెలువరించింది.

ఈ ఏడాది జనవరి 2న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 1ను తీసుకొచ్చింది. దాన్ని సవాల్‌ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో పిల్‌ వేశారు. ఇదే జీవోను సవాలు చేస్తూ మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు గిడుగు వీర వెంకట రుద్రరాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఏఐఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఐఏవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రతిపక్షాలు రోడ్డుపై నిర్వహించే కార్యక్రమాలను జీవో నంబర్‌ 1 పేరుతో అడ్డుకునే ప్రమాదం ఉందని.. అందువల్ల దాన్ని రద్దు చేయాలని కోరారు. ఆ వ్యాజ్యాలపై జనవరి 24న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం లోతైన విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఆ జీవోను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని