TTD: తిరుపతి పద్మావతి నిలయంలో మార్పులు చేయొద్దు: ఏపీ హైకోర్టు

తిరుపతిలోని శ్రీపద్మావతి నిలయాన్ని కలెక్టరేట్‌కు ఇచ్చే అంశంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీపద్మావతి నిలయంలో

Updated : 22 Mar 2022 19:08 IST

అమరావతి: తిరుపతిలోని శ్రీపద్మావతి నిలయాన్ని కలెక్టరేట్‌కు ఇచ్చే అంశంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీపద్మావతి నిలయంలో కలెక్టరేట్‌ ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. భక్తుల విరాళాలతో వచ్చిన సొమ్ముతో పద్మావతి నిలయం ఏర్పాటు చేశారని, అలాంటి భవనాన్ని కలెక్టరేట్‌ కోసం కేటాయించడం సమంజసం కాదని, నిబంధనలకు విరుద్ధమని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. కలెక్టరేట్‌ ఏర్పాటుకు ఇచ్చిన ప్రొసీడింగ్స్‌పై యథాతథస్థితి పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. భవనంలో ఎలాంటి మార్పులు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. కౌంటరు దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ ఈనెల 29కి వాయిదా వేసింది. 

నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని ఏడు నియోజక వర్గాలతో తిరుపతి కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న శ్రీబాలాజీ జిల్లాకు కలెక్టరేట్‌ సిద్ధమైంది. ఏప్రిల్‌ 2 నుంచి ప్రారంభంకానున్న ఈ జిల్లాకు సంబంధించి.. తాత్కాలికంగా ప్రభుత్వ శాఖల కార్యాలయాలను తిరుచానూరులోని పద్మావతి నిలయంలో ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా అక్కడ శ్రీబాలాజీ జిల్లా కలెక్టరేట్‌ బోర్డునూ ఏర్పాటు చేశారు. ఆ మేరకు అధికారులు సంబంధిత మిగిలిన పనుల్లో నిమగ్నమయ్యారు. పద్మావతి నిలయంలో కలెక్టరేట్‌ మాత్రమే ఏర్పాటు చేయాలని అధికారులు ముందస్తుగా నిర్ణయించారు. ఇక్కడ 200 వరకు గదులు ఉండగా... దానికి తోడు ప్రతి గది విశాలంగా ఉండటం కలిసొచ్చింది. దీంతో అధికారులు వివిధ శాఖలకు చెందిన జిల్లా కార్యాలయాలనూ పద్మావతి నిలయంలోనే ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. ఒక్కో గదిలో పర్యవేక్షకుల(సూపరింటెండెంట్‌) స్థాయి అధికారితో పాటు ముగ్గురు గుమాస్తాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ మేరకు గదులు కేటాయించి.. నంబర్లు ఇచ్చారు. అవసరమైన పనులు చేయడంలో నిమగ్నమయ్యారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నారు. ఈనేపథ్యంలో పద్మావతి నిలయంలో కలెక్టరేట్‌ ఏర్పాటు పనులపై హైకోర్టు యథాతథ స్థితి పాటించాలని ఆదేశించడంతో అధికారుల్లో సందిగ్ధత నెలకొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని