AP News: ఇళ్ల నిర్మాణంపై డివిజన్‌బెంచ్‌లోనూ ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో సారి ఎదురుదెబ్బ తగిలింది. ఇళ్ల నిర్మాణంలో సింగిల్‌ జడ్జి తీర్పుపై ప్రభుత్వ అప్పీల్‌ను స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది. ‘సెంటు

Updated : 09 Oct 2021 20:47 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో సారి ఎదురుదెబ్బ తగిలింది. ఇళ్ల నిర్మాణంలో సింగిల్‌ జడ్జి తీర్పుపై ప్రభుత్వ అప్పీల్‌ను స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది. ‘సెంటు భూమిలో ఇల్లు ఎలా సరిపోతుంది. ఇళ్ల స్థలాలపై ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించండి. అప్పటి వరకూ నిర్మాణాలు చేపట్టవద్దు. కన్వేయన్స్‌ డీడ్‌లు రద్దు చేసి డీ-ఫాం పట్టాలివ్వండి. మహిళలకే కాదు.. పురుషులు, ట్రాన్స్‌ జెండర్లకూ స్థలాలివ్వాలి’’ అని నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకంపై నిన్న హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.  ఇళ్ల నిర్మాణంపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. డివిజన్‌ బెంచ్‌లో రాష్ట్ర ప్రభుత్వం  హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రభుత్వ అప్పీల్‌ను స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది.

లోపాలను ఎత్తిచూపిన హైకోర్టు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకంలో పలు లోపాలను హైకోర్టు ఎత్తిచూపింది. ప్రధానంగా మూడు అంశాలను కోర్టు ప్రస్తావించింది. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలాలు సరిపోవని, ఈ విషయంలో ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని సూచించింది. ఆ ప్రక్రియ ముగిసే వరకు ఆ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టవద్దని తీర్పు చెప్పింది. మహిళల పేరుతోనే పట్టాలివ్వడం సరికాదని, అర్హులైన పురుషులు, ట్రాన్స్‌జెండర్లకూ ఇవ్వాలని చెప్పింది. ఇళ్లస్థలాల రిజిస్ట్రేషన్‌ కన్వేయన్స్‌ డీడ్‌లను రద్దు చేసి, అర్హులకు డీ-ఫాం పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది గతేడాది డిసెంబరులో హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి శుక్రవారం ఈ మేరకు సంచలన తీర్పు ఇచ్చారు. ఇళ్ల స్థలాల విస్తీర్ణంపై కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇళ్ల నిర్మాణంలో పర్యావరణ ప్రభావం, ఆరోగ్య సమస్యలు, ఇతర అంశాలపై అధ్యయనానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు చెందిన ముగ్గురు నిపుణులతో నెల రోజుల్లో కమిటీ వేయాలని ఆదేశించింది. మరో నెలలో ఆ కమిటీ నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. నివేదికను రెండు స్థానిక పత్రికల్లో ప్రచురించి.. ప్రజల అభ్యంతరాలు స్వీకరించాలని సూచించింది.

ఆ తర్వాతే ఈ పథకాన్ని ఖరారు చేయాలని స్పష్టంచేసింది. కమిటీ నివేదిక ఆధారంగా అదనపు భూమి కొని, స్థలం విస్తీర్ణం పెంచి, లబ్ధిదారులకు కేటాయించిన లేఅవుట్లను సవరించాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ ముగిసేవరకూ ఈ పథకం కింద కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దని తేల్చిచెప్పింది. ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 367లోని మార్గదర్శకాలు-2,3, జీవో 488లోని క్లాజ్‌ 10,11,12, జీవో 99లోని క్లాజ్‌ బీ,డీలను చట్టవిరుద్ధమైనవంటూ, వాటిని రద్దుచేసింది.

డీ-ఫాం పట్టాలే ఇవ్వాలి: ఆ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌ కన్వేయన్స్‌ డీడ్‌లను రద్దు చేయాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. వాటి స్థానంలో నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు బీఎస్‌వో 21, ఏపీ అసైన్డ్‌ భూముల చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా అర్హులకు డీ-ఫాం పట్టాలు ఇవ్వాలని ఆదేశించింది. ఇళ్ల పట్టాలను మహిళా లబ్ధిదారులకే ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. మహిళలతో పాటు అర్హులైన పురుషులు, ట్రాన్స్‌జెండర్లకూ పట్టాలు ఇవ్వాలంది. మహిళల పేరుతోనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం.. అధికరణ 14, 15(1), 39కి విరుద్ధమని తేల్చిచెప్పింది. ఆ నిర్ణయం మానవ హక్కుల యూనివర్సల్‌ డిక్లరేషన్‌కు వ్యతిరేకమంది.

నేపథ్యం ఇదీ.. పేదలందరికీ ఇళ్లు పథకం కింద 25 లక్షల ఇళ్ల స్థలాలు/హౌసింగ్‌ యూనిట్లు ఇచ్చేందుకు జారీ చేసిన జీవోలను సవాలుచేస్తూ తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది డిసెంబరులో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇళ్ల స్థలాలను మహిళలకే కేటాయించడంపై అభ్యంతరం తెలిపారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఆంజనేయులు వాదనలు వినిపించారు. మహిళలకే ఇళ్లపట్టాలు ఇవ్వడంపురుషులు, ట్రాన్స్‌జెండర్లపై వివక్షేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కుటుంబాన్ని ఓ యూనిట్‌గా తీసుకొని స్థలం కేటాయించామన్నారు.

తీర్పులో ఏముందంటే.. ‘ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో ప్రాథమిక హక్కులు, మానవహక్కుల ఉల్లంఘన చోటు చేసుకుంటున్నట్లు భావిస్తే న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చు. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలం ఇంటి నిర్మాణానికి సరిపోదు. లబ్ధిదారులను ఇళ్లు కట్టుకోవాలని కోరేముందు ప్రభుత్వం.. పర్యావరణ ప్రభావం, ఆనారోగ్య సమస్యలు, అగ్నిప్రమాదాలు, మంచినీటి లభ్యత, మురుగు రవాణాకు సౌకర్యాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించాలి. కానీ ఈ పథకంలో ప్రభుత్వం అధ్యయనం చేయలేదు. నివాసహక్కు పొందేందుకు చట్టాలున్నాయి గానీ, తగినంత విస్తీర్ణంలో ఇల్లుండాలనే అంశంపై చట్టాలు లేవు. తగినంత నివాస స్థలం కలిగి ఉండటం మానవహక్కుల్లో భాగమే. తగినంత స్థలం లేకపోతే.. జరిగే దుష్పరిణామాలపై నిపుణుల కమిటీ అధ్యయనం చేయాలి. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం.. ప్రపంచ ఆరోగ్యసంస్థ మార్గదర్శకాలను పట్టించుకోలేదు. ఇరుకైన ఇళ్లలో నివాసం వ్యక్తుల పురోభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. మహిళలకు స్థలాల కేటాయింపునకు న్యాయస్థానం వ్యతిరేకం కాదు. కానీ మహిళలకే ఇస్తామనడం వివక్ష చూపడమే. అర్హులైన పురుషులు, ట్రాన్స్‌జెండర్లకూ స్థలాలిచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. భార్య మరణించిన పురుషులూ ఉంటారు. స్త్రీలతో సమానంగా మిగిలినవారికీ హక్కులుంటాయి. ఈ పథకంలో కేటాయించిన స్థలాన్ని ఐదేళ్ల తర్వాత విక్రయించుకునేందుకు వెసులుబాటు కల్పించడం సరికాదు. ఆ స్థలాలను అమ్ముకుంటే వారు ఇల్లులేనివాళ్లు అవుతారు. పథకం విషయంలో మొదట జారీచేసిన మార్గదర్శకాలకు.. తర్వాత జారీచేసిన వాటికి పొంతనలేదు. మొదటి మార్గదర్శకాలకు అనుగుణంగా బీఎస్‌వో-21, అసైన్‌మెంట్‌ చట్ట ప్రకారం డి-ఫాం పట్టా ఇవ్వాలి. కానీ అదనంగా జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ఇంటి స్థలం ‘కన్సెషనల్‌ కేటాయింపు’తో ఐదేళ్ల తర్వాత అమ్ముకునే వీలు కల్పించారు.ఒకవేళ లబ్ధిదారు విక్రయిస్తే.. మరోసారి స్థలం కేటాయించరు. దీంతో ఇల్లులేనివారిగా మిగిలిపోతారు’ అని తీర్పులో పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని