Ap Highcourt: ప్రభుత్వ సలహాదారులను నియమించుకుంటూ పోతే ఎలా?: ఏపీ హైకోర్టు

ప్రభుత్వ సలహాదారుల నియామకంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది.

Updated : 02 Feb 2023 19:48 IST

అమరావతి: ప్రభుత్వ సలహాదారుల నియామకంపై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. దేవాదాయశాఖ సలహాదారు శ్రీకాంత్‌, ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్‌ రెడ్డి నియామకాలపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను కలిపి ఉన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. సలహాదారుల నియామకంపై రాజ్యాంగబద్ధతను తేలుస్తామని పునరుద్ఘాటించింది. ఇలా నియమించుకుంటూ పోతే వీరి సంఖ్యకు పరిమితి ఏమీ ఉండదని వ్యాఖ్యానించింది. 

మరోవైపు ఎప్పటి నుంచో సలహాదారలు నియామకాలు జరుగుతున్నాయని.. దీనిపై ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. రాజ్యాంగ విరుద్ధంగా వీరిని నియమించట్లేదని.. కేబినెట్‌ హోదా కూడా ఇవ్వట్లేదని కోర్టుకు తెలిపారు. చాలామంది సలహాదారుల కాలపరిమితి ముగిసిపోనుందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న న్యాయస్థానం.. బయట నుంచి నియమితులైన వారిలో జవాబుదారీతనం ఎలా ఉంటుందని ప్రశ్నించింది. బయటి వారికి ప్రవర్తనా నియమావళి లేదని.. వారివల్ల సున్నిత సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 28కు హైకోర్టు వాయిదా వేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని