Ap JAC: మంత్రుల బృందంతో మాటలు.. చాయ్‌ బిస్కెట్‌ చర్చలే!: బొప్పరాజు

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఉద్యమ కార్యాచరణను ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు.

Updated : 26 Feb 2023 19:13 IST

విజయవాడ: ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో జరిపిన చర్చల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. మంత్రుల బృందంతో మాటలు.. చాయ్‌ బిస్కెట్‌ చర్చలే తప్ప ఎలాంటి ఫలితం లేదన్నారు. నగరంలోని రెవెన్యూ భవన్‌లో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలపై చర్చించారు. ఉద్యమ కార్యాచరణను ఏపీ జేఏసీ ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. 

‘‘ఫిబ్రవరి 13న ఏపీజేఏసీ అమరావతి నుంచి సీఎస్‌కు 50 పేజీల వినతిపత్రం ఇచ్చాం. అయినా ఎలాంటి స్పందన లేదు. ఉద్యోగులు చట్టబద్ధంగా దాచుకున్న డబ్బును రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది. న్యాయబద్ధంగా రావాల్సిన జీతభత్యాలు సకాలంలో ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ప్రభుత్వం ఉద్యోగులను చులకనగా భావిస్తోంది. ఉద్యోగులు ఎంతో ఓర్పుతో ఎదురుచూస్తుంటే దాన్ని చేతగానితనంగా చూస్తోంది. చలో విజయవాడ జరిపి ఏడాది గడిచినా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదు. మంత్రుల బృందంతో జరిపిన చర్చలన్నీ చాయ్‌ బిస్కెట్‌ చర్చలుగా మిగిలాయి. నెలలో 20వ తేదీ వరకు ఉద్యోగులకు జీతాలు ఇస్తూనే ఉన్నారు. జీతాలు రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కిరాణా కొట్టు వారు కూడా ఉద్యోగులను చులకన భావంతో చూస్తున్నారు. మా ఉద్యమానికి అన్ని ప్రజా సంఘాలు సహకరించాలని, ఉద్యోగ సంఘాలు కలిసి రావాలని కోరుతున్నాం’’ అని బొప్పరాజు వివరించారు.

ఉద్యమ కార్యాచరణ ఇదే..

* మార్చి 9, 10 తేదీల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన
* మార్చి 13, 14న కలెక్టర్‌, ఆర్డీవో కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో ఆందోళన
* మార్చి 15, 17, 20 తేదీల్లో అన్ని జిల్లా కలెక్టరేట్ల  వద్ద ధర్నాలు
* మార్చి 21 నుంచి సమయ వేళల్లోనే పనిచేసేలా వర్క్‌ రూల్‌ అమలు
* మార్చి 21 నుంచి సెల్‌ డౌన్‌.. అన్ని ప్రభుత్వ యాప్‌లను బంద్‌ చేస్తాం
* మార్చి 24న హెచ్ వోడీ కార్యాలయాల వద్ద  ధర్నాలు 
* మార్చి 27న కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తాం 
* ఏప్రిల్  1న .. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలు సహా సమస్యల్లో ఉన్న ఉద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తాం
* ఏప్రిల్ 3న ఛలో స్పందన లో మెమోరాండం ఇస్తాం 
* ఏప్రిల్ 5న రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించి.. మలిదశ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని